Police Vehicles: పోలీస్‌లా లాఠీ కొట్ట‌డానికి కాదు.. మ‌న‌ల్ని స‌న్మార్గంలో న‌డిపించ‌డానికి: ఎన్టీఆర్

Police Vehicles: సీపీ స‌జ్జ‌నార్ నేతృత్వంలో సైబ‌రాబాద్ పోలీసుల పెట్రోలింగ్ వాహ‌నాల‌ను యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో అడిష‌న్ డీజీ రైల్వేస్ సందీప్ శాండిల్య‌, ట్రాఫిక్ డీసీపీ విజ‌య్‌కుమార్ పాల్గొన్నారు. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న జాతీయ ర‌హ‌దారి భ‌ద్ర‌త ప‌రంగా సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ నేతృత్వంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో నాకు ఎంతో ఇష్టమైన ఇద్దరిని కోల్పోయాను.

జానకిరామ్, నా తండ్రి హరికృష్ణ గారిని కోల్పోయాను. నేను చెప్పేది ఒక్కటే మనం ఎంతో జాగ్రత్తగా ఉన్నా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో వారిని గుర్తు తెచ్చుకోండి. మనకోసం మన వారు ఎదురు చేస్తుంటారని గుర్తుంచుకోండి. దయచేసి నిబంధనలు పాటించి వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. పోలీసుల చేతిలో ఉన్న లాఠీ మనని దండిచడానికి కాదు మ‌న‌ల్ని సన్మార్గంలో నడిపించడానికి అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. అలాగే సీపీ స‌జ్జ‌నార్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ పోలీసులు ర‌హ‌దారి భ‌ద్ర‌త ప‌రంగా ఎన్నో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ మంచి ఫ‌లితాల‌ను సాధిస్తున్నార‌ని సైబరాబాద్‌ ట్రాఫిక్ పోలీసుల‌ను కొనియాడారు. అలాగే డీసీపీ విజ‌య్‌కుమార్ ఆధ్వ‌ర్యంలో పోలీసుల కృషి వ‌ల్ల ట్రాఫిక్ జామ్ వంటి స‌మ‌స్య‌లుగానీ, రోడ్డు ప్ర‌మాదాలు చాలా వ‌ర‌కు త‌గ్గిపోయాయ‌ని అన్నారు. వాహ‌నదారులు మ‌ద్యం తాగి, హెల్మెట్ పెట్టుకోకుండా.. సైబ‌రాబాద్ ప‌రిధిలోని రోడ్ల‌పైకి రాకుండా భావ‌న క‌లిగించడానికి కృషి చేసిన ట్రాఫిక్ పోలీసులకు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాన‌ని సీపీ స‌జ్జ‌నార్ తెలిపారు.