ఏపీలో నాలుగు షోలకు పర్మిషన్ – ఫుల్ ఆక్యుపెన్సీ పెంచినందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ గారికి కృతజ్ఞతలు : ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు నారాయణ్ దాస్ నారంగ్!!

ఆంధ్రప్రదేశ్ లో ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారంతో పాటు నాలుగు షోలకు పర్మిషన్, అలాగే వందశాతం సీటింగ్ ఆక్యుపెన్సీ లాంటి పలు విషయాల గురించి ఎపి మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతలు భేటీ అయ్యారు. సెప్టెంబర్ 20న ఏపీ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ఎగ్జిబిటర్లు, ప్రతినిధులు మంత్రి పేర్నినానితో చర్చలు జరిపారు. టాలీవుడ్‌ ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులపై చర్చించారు. వీలైనంత త్వరగా పరిష్కారం చూపించాలని కోరారు. ఎగ్జిబిటర్లు, నిర్మాతలను అడిగి తెలుసుకున్న మంత్రి పేర్ని నాని, సీఎం జగన్‌తో చర్చించి పలు సమస్యలపై స్పందించారు. ముఖ్యంగా నాలుగు షోలకు పర్మిషన్, అలాగే ఫుల్ ఆక్యుపెన్సీ లాంటి అంశాలకు పర్మిషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎపి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపేందుకు గురువారం ఫిలిం ఛాంబర్ లో పాత్రికేయల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు నారాయణ్ దాస్ నారంగ్, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్, నిర్మాతల మండలి కార్యదర్శి టి ప్రసన్న కుమార్, నిర్మాత భరత్ చౌదరి, నిర్మాత ముత్యాల రాందాస్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు నారాయణ్ దాస్ నారంగ్ మాట్లాడుతూ .. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడీ గారికి, మంత్రి పేర్ని నాని గారికి, ఎఫ్డిసి చైర్మన్ విజయ్ చందర్ గారు, ఎఫ్ డిసి ఎండి విజయ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆంధ్ర ప్రదేశ్ లో థియటర్స్ ఫుల్ ఆక్యుపెన్సీ పెంచినందుకు, అలాగే నాలుగు షో లకు పర్మిషన్ ఇచ్చినందుకు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, త్వరలోనే వాటి గురించి కూడా పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నాం అన్నారు.

నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ మాట్లాడుతూ .. తెలుగు ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున, 24 క్రాఫ్ట్ తరపున ఫిలిం ఇండస్ట్రీ తరపున వై ఎస్ జగన్ మోహన్ రెడీ గారిని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సినిమా ఇండస్ట్రీ కష్టాలను అర్థం చేసుకుని మంత్రి పేర్ని నాని గారు, ఎఫ్డిసి ఎండి విజయ్ కుమార్ రెడ్డి గారు, ఇలా అందరు ఈ సమస్యను అర్థం చేసుకుని సినిమా లకు నాలుగో షో కి పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. సినిమా పరిశ్రమ తరపున ఒక్కటే విన్నపం.. సినిమా పరిశ్రమకు ప్రభుత్వం లో ఉన్న వారితో మాకు సంబంధం. మా సమస్యలను వారికే విన్నవించుకుంటాం. ప్రభుత్వంలో ఎవరంటే వారికి మా సమస్యలను చెప్పుకుంటాం.. వారివల్ల మా సమస్యలను పరిష్కరించుకుంటాం. అందుకే మాకు ప్రభుత్వాల అండతోనే మేము ముందుకు సాగుతాం. సినిమా పరిశ్రమలో రాజకీయాలు ఉన్నప్పటికీ మొత్తం పరిశ్రమకు కావాల్సింది ఆ ప్రభుత్వం సహకారం. ఇది మేము స్పష్టంగా తెలుపుతున్నాం. మాకు చాలా సమస్యలు ఉన్నప్పటికీ అందులో కొన్ని సమస్యలను ఎపి ప్రభుత్వం తీర్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక థియటర్స్ టికెట్ విషయం లో కూడా ప్రభుత్వం మా సమస్యను పరిస్కరిస్తుందన్న నమ్మకం ఉంది. సినిమా ఇండస్ట్రీ ప్రజలకు అంటే ప్రేక్షకులకు వినోదం పంచడం మాత్రమే మా వంతు. అలా ప్రజలను సంతోషపరిచే ఇండస్ట్రీ సమస్యలను తీర్చే అధికారం ప్రభుత్వానికి ఉంది. సినిమా పరిశ్రమ కూడా మీలో ఒకటిగా భావించుకోవాలని కోరుతున్నాం. మాకు ఇద్దరు తండ్రులు ఉన్నారు. మా సమస్యలను వారిద్దరికీ విన్నవించుకుని ముందుకు సాగుతాం అన్నారు.

నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ .. ఇన్నాళ్లు ఎపి లో మూడు షోలకే పర్మిషన్ ఉండగా దాన్ని నాలుగు షో లకు పర్మిషన్ ఇచ్చారు. అలాగే థియటర్స్ లో వందశాతం ఆక్యుపెన్సీ పెంచినందుకు ఎపి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సినిమా ఇండస్ట్రీ లో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. వాటిలో ఒక్కొక్కొటిగా ప్రభుత్వం సాల్వ్ చేస్తుంది. అటు ఎపి ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వాల సహకారాలు తెలుగు ఇండస్ట్రీకి కావాలి. కరోనా కాలంలో ఎన్నడూ చూడని విపత్తు సినిమా పరిశ్రమ చూసింది. దాని నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. ప్రభుత్వాల సహకారంతో సినిమా పరిశ్రమ సమస్యలు తీర్చేందుకు కృషి చేయాలనీ అన్నారు.

నిర్మాత భరత్ చౌదరి మాట్లాడుతూ .. సినిమా ఇండస్ట్రీ లో ఉన్న సమస్యల గురించి ఇటీవలే మంత్రి పేర్ని నానితో చర్చలు జరిపారు. ఈ సందర్బంగా చాలా సమస్యలను ఆయనముందు ఉంచాం.. వాటిలో కొన్ని సమస్యలను తీర్చారు.. ఈ సందర్బంగా వై ఎస్ జగన్ గారికి థాంక్స్ చెబుతున్నాం. ఇప్పటికే చాలా సినిమాలు విడుదల కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతం నాలుగు షోలకు పర్మిషన్ ఇవ్వడం, వందశాతం ఆక్యుపెన్సీ పెంచడంతో చాలా పెద్ద సినిమాలు కూడా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. సినిమా పరిశ్రమలో ఉన్న సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకుని సాల్వ్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నాం అన్నారు.

ముత్యాల రాందాస్ మాట్లాడుతూ .. ఇప్పుడిప్పుడే తెలుగు పరిశ్రమకు మంచి రోజులు వస్తున్నాయి. ఎపి లో నాలుగు షోలకు అనుమతి ఇచ్చినందుకు, అలాగే వందశాతం ఆక్యుపెన్సీ పెంచినందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఆలాగే ఈ మద్యే జరిగిన మీటింగ్ లో సినిమా పరిశ్రమలో ఉన్న సమస్యలను మీ ముందు ఉంచాం.. ఆ సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తారని ఆశిస్తున్నాము అన్నారు.