ప్రపంచ ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు ద్వారెన్ బ్రావో తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం

People Media Factory

ప్రపంచ ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు ద్వారెన్ బ్రావో తో తమ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ షార్ట్ ఫిలిం ను నిర్మించటాన్ని ఎంతో సంతోషంగా ప్రకటించారు సంస్థ అధినేత టి.జి.విశ్వప్రసాద్.
ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టుగా వైవిధ్య‌మైన క‌థా చిత్రాను నిర్మిస్తూ…విజ‌యాలు సాధిస్తూ..అటు ఆడియ‌న్స్ లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను అన‌తి కాలంలోనే ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ. ఎం.ఎల్.ఎ, వైఫ్ ఆఫ్ రామ్, సిల్లీఫెలో, గూఢ‌చారి చిత్రాల‌ను నిర్మించిన ఈ సంస్థ ప్ర‌స్తుతం స‌మంత అక్కినేని ప్ర‌ధాన పాత్ర‌లో ఓ బేబి, విక్ట‌రీ వెంక‌టేష్ – యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్ లో భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీ మామ, అనుష్క‌, మాధ‌వ‌న్, కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడ‌స‌న్ కాంబినేష‌న్లో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ సైలెన్స్, నాగ శౌర్య‌తో చిత్రాలను నిర్మిస్తోంది. ఇలా విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తున్న ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విదేశాలలో షూటింగ్ జరుపుకోవటానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా సమకూరుస్తున్న విషయం విదితమే. కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా, వీటితోపాటు సామాజిక స్పృహ కు సంబంధించిన విషయాలలో కూడా ప్రజలలో అవగాహన కల్పించటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు సంస్థ నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల. విషయానికి వస్తే ఈ సంస్థ మరో ముందడుగు వేసి ప్రపంచ ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు ద్వారెన్ బ్రావో తో , తమ సంస్థ ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CRS )’ లో భాగంగా ఓ షార్ట్ ఫిలింను నిర్మించ బోతోంది. దీనికి సంబంధించి నేటి ఉదయం వీరిరువురి మధ్య ఒప్పందాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ద్వారెన్ బ్రావో తో పాటు చిత్ర నిర్మాత టి.జి.విశ్వప్రసాద్,సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నటరాజ్ పిళ్ళై లు పాల్గొన్నారు.
సోషల్ అవేర్నెస్ కు సంబంధించి రూపొందే ఈ లఘు చిత్రం కోయంబత్తూర్, తమిళనాడు, అలాగే వెస్ట్ ఇండీస్ లోని ట్రినిడాడ్, టొబాగో లలో చిత్రీకరణ జరుపుకుంటుంది. రేపటినుంచి కోయంబత్తూర్ లో షూటింగు ప్రారంభమవుతుందని దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మీడియాకు తెలుపుతామని ప్రకటించారు నిర్మాత టి.జి.విశ్వప్రసాద్