ఆడి చావు మన చేతుల్లో ఉందన్న పాయల్

‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్‌పుత్.. ఆ సినిమాతో హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న పాయల్.. ప్రస్తుతం అనేక సినిమాల్లో నటిస్తోంది. వరుసపెట్టి ఆమెకు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. బాలీవుడ్‌లో కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం తెలుగులో ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘అనగనగా ఓ అతిథి’ విడుదలకు సిద్ధమమైంది. ఈ నెల 20న ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో ఇది విడుదల కానుంది.

వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. దయాల్‌ పద్మనాభం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్‌ ప్రతి నాయకురాలి ఛాయలున్న పాత్రలో నటించింది. ఈ సినిమాలో పాయల్ చెప్పిన కొన్ని డైలాగ్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

‘మన కట్టాలన్నీ తీరడానికి ఒకటే దారుంది.. ఆడి సావు మన సేతుల్లోనే ఉంది. అదే విధి’. ‘కూరకి కోడిని నువ్వు కొయ్యి.. కూర తిన్నోడ్ని..’ అంటూ పాయల్‌ చెప్పిన డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘ఆర్ఎక్స్ 100’ సినిమా తర్వాత పాయల్ రాజ్‌పుత్‌కు ఆ స్థాయి విజయం దక్కలేదు. దీంతో ఈ సినిమాపై పాయల్ చాలా ఆశలు పెట్టుకుంది.