ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాను…

మూవీ ఆర్టిస్టుల సంఘంలో స‌భ్య‌త్వం ఉన్న సీనియ‌ర్ ఆర్టిస్టుల‌కు నెల‌కు రూ.6వేలు చొప్పున సాయంగా పెన్షన్ అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా క‌ష్ట‌కాలంలో ఇది అంద‌రికీ వ‌రంగా మారింది. స‌భ్యులకు మెడిక్లెయిమ్ ఇన్సూరెన్సె స‌దుపాయాలు ఆదుకుంటున్నాయి.

పావ‌ల శ్యామ‌ల వంటి సీనియ‌ర్ న‌టీమ‌ణి స‌రైన ఉపాధి లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు మెగాస్టార్ చిరంజీవి 2ల‌క్ష‌లు రూపాయలు సాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. కుమార్తె శ్రీ‌జ చేతుల‌మీదుగా ఈ సాయం చేశారు. తాజా స‌మాచారం మేర‌కు.. మ‌రోసారి పావ‌ల శ్యామ‌ల ఉపాధి లేక ఈ క‌ష్ట‌కాలంలో తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్నార‌ని తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి పావ‌ల శ్యామ‌ల‌కు మా త‌ర‌పున స‌భ్య‌త్వ‌ కార్డ్ నిమిత్తంగా మంగళవారం నాడు 1,01,500 (1ల‌క్షా 1500) చెక్ ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ స‌భ్యులు క‌రాటే క‌ళ్యాణి, సురేష్ కొండేటి స్వ‌యంగా అందించారు. ఇక‌పై కొత్త స‌భ్యురాలైన్ పావలా శ్యామల గారికి ‘మా’ మెంబ‌ర్ షిప్ కార్డ్ తో నెల‌కు 6 వేల చొప్పున ప్రతినెలా పెన్షన్ రూపంలో ఆమెకు ‘మా’ అందించటం జరుగుతోంది. అలాగే ఎవ‌రైనా ఆర్టిస్ట్ అకాల‌మ‌ర‌ణం చెందితే వారికి 3ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈ క‌ష్టకాలంలో ఆపద్బాంధవుడిలా పావ‌ల‌శ్యామ‌ల‌ను ఆదుకునేందుకు ముందుకొచ్చి ‘మా’ కార్డు ఇపించే నిమిత్తంగా లక్షా పదిహేను వందల రూపాయలు ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి కమిటీ స‌భ్యులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఈ సందర్బంగా పావ‌ల శ్యామ‌ల మాట్లాడుతూ-చిరంజీవి గారు 2ల‌క్ష‌ల ఆర్థిక సాయం చేసిన‌ప్పుడు మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పుడు నేను ఎంతో క‌ష్టంలో ఉన్నాను. తీవ్ర మాన‌సిక వేద‌న‌ను అనుభవించాను. నా కుమార్తెకు టీబీ వ్యాధికి చికిత్స చేయించ‌లేని ప‌రిస్థితి. కాలు విరిగి తీవ్ర ఇబ్బందిలో ఉంటే.. అప్పుడు ఆ రెండు లక్షల ఆర్థిక సాయం న‌న్ను ఎంతో ఆదుకుంది. ఆ మేలు ఎన్న‌టికీ మ‌ర్చిపోలేను. అప్పుడు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రూ సాయం చేయ‌లేదు. కానీ నాకు మెగాస్టార్ కుమార్తె వ‌చ్చి 2 లక్షల ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. వారికి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. ఇప్పుడు ఈ క‌ష్టంలో మ‌రోసారి లక్షా పదిహేను వందల రూపాయలు చెక్ రూపంలో ఇచ్చి అంతేకాకుండా ప్రతి నెలా ఆరువేల రూపాయలు సాయం అందించేందుకు సాయ‌ప‌డ్డారు. మ‌న‌స్ఫూర్తిగా చిరంజీవి గారికి నా ధ‌న్య‌వాదాలు అని అన్నారు.