
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలంలోని యజ్ఞనారాయణపురంలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తనయులు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పోలిట్బ్యూరో సభ్యులు శ్రీ టి.డి.జనార్ధన్ ముఖ్య అతిథులుగా పాల్గొని విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు, డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, కేతినేని హరీశ్, శ్రీయాస్ శ్రీనివాస్, మందలపు సుధాకర్, పోటు సరస్వతి, రంజిత్, నవీన్ చంద్ర, ఇతర రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం మాట్లాడుతూ – ఈ రోజు ఎన్టీఆర్ అన్నగారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మన యజ్ఞనారాయణపురంలో ఇంత ఘనంగా జరగడం సంతోషంగా ఉంది. రామకృష్ణ గారు ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చారని తెలిసి పిల్లలు, పెద్దలు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. నేను అన్నగారు పార్టీ పెట్టినప్పుడు టీడీపీలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కొనసాగుతున్నాను. మన టీడీపీ నాయకులు నెలలో కనీసం మూడు రోజులు మా ప్రాంతానికి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అన్నారు.
ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పోలిట్బ్యూరో సభ్యులు టి.డి.జనార్ధన్ మాట్లాడుతూ – యజ్ఞనారాయణపురం ఒక చిన్న గ్రామం. ఇలాంటి గ్రామంలో ఎన్టీఆర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పెట్టినా ఇంత భారీగా ప్రజలు తరలి వచ్చారంటే అన్నగారికి ప్రజల్లో ఉన్న ప్రేమ ఎంతో తెలుస్తోంది. ఆయన స్వర్గస్థులై 30 ఏళ్లవుతోంది. అయినా ప్రజలు అన్నగారిని మర్చిపోలేదు. ఎన్టీఆర్ లాంటి నాయకులు మరొకరిని ఊహించలేం. ఎన్నేళ్లయినా ఆయన ప్రజల గుండెల్లో ప్రజా నాయకుడిగా గుర్తుండిపోతారు. రాజకీయాల్లో ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. అవి ఇప్పటి నేతలు అనుసరించడం ఎన్టీఆర్ దార్శనికతకు నిదర్శనం. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిపిన యజ్ఞనారాయణపురం టీడీపీ నాయకులకు, ఖమ్మం జిల్లా టీడీపీ నాయకులకు కృతజ్ఞతలు. మేము ఎన్టీఆర్ గారి శతజయంతి, ఇప్పుడు 75 ఏళ్ల సినీ స్వర్ణోత్సవం కార్యక్రమాన్ని ప్రపంచంలో దేశ దేశాల్లో జరుపుతున్నాం. అలాగే ఎన్టీఆర్ గారి గురించిన సాహిత్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. తరతరాల ప్రజలు తెలుసుకోవాల్సిన చరిత్ర అన్నగారిది. ఆంద్రాలో లాగా తెలంగాణలో తరువాత కూటమి ప్రభుత్వంమే వస్తుంది అన్నారు.
నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ – యజ్ఞనారాయణపురంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కర కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఎండల్ని లెక్క చేయకుండా ఎంతోమంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి నా కృతజ్ఞతలు చెబుతున్నాను. అలాగే ఖమ్మం జిల్లా టీడీపీ నాయకులు, యజ్ఞనారాయణపురం నేతలు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. సినీ రంగంలో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్, తెలుగు రాజకీయాలను కొత్త మలుపు తిప్పారు. నటుడిగా ఉన్నప్పుడే ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు, ఇండియా పాకిస్థాన్ యుద్ధం జరిగినప్పుడు విరాళాలు సేకరించి ప్రజలకు, సైనిక సంక్షేమ నిధికి అందజేశారు. ప్రాంతాలకు అతీతంగా తెలుగు జాతి మొత్తం ఒక్కటేనని చాటిన మహానుభావుడు ఎన్టీఆర్. ఆయన ఆశయాలు, స్ఫూర్తితో మనమంతా ముందుకు వెళ్లాలి అన్నారు.