రికార్డు స్థాయిలో ఎన్ .టి .ఆర్ . స్మారక నాణెం అమ్మకాలు…

హైదరాబాద్ మింట్ లో తయారైన తొలి స్మారక నాణెం ఎన్ .టి .రామారావు గారిది , ఈ నాణెం రెండున్నర నెలల్లో 25, 000 అమ్ముడు పోవడం దేశంలోనే సరికొత్త రికార్డు అని మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వి .ఎన్ .ఆర్ . నాయుడు చెప్పారు.
శనివారం, ఎన్ .టి .ఆర్. సెంటినరీ కమిటీ చైర్మన్ టి,డి .జనార్దన్ ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్ మింట్ అధికారులు వి, ఎన్ .ఆర్ .నాయుడు, శ్రీనివాస్ గండపనేడు , తానాజీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ – దేశంలో స్మారక నాణేల విడుదల 1964 నుంచి ప్రారంభమైంది, మొదట జవహర్ లాల్ నెహ్రూ , ఆ తరువాత మహాత్మా గాంధీ లాంటి మహనీయుల నాణేలను కేంద్రం విడుదల చేయడం జరిగిందని , అయితే ఇప్పటి వరకు స్మారక నాణేలలో 12,000 నాణేలు రికార్డు అని , ఆ రికార్డు ను ఎన్ .టి .ఆర్ . స్మారక నాణెం బ్రేక్ చేసిందని , ఆగష్టు 28న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని ఢిల్లీలో విడుదల చేశారని , 29 నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చామని చెప్పారు . కేవలం రెండున్నర నెలల్లోనే 25,000 స్మారక నాణేలను విక్రయించడం జరిగిందని చెప్పారు .

కమిటీ చైర్మన్ టి .డి .జనార్దన్ మాట్లాడుతూ , అన్న ఎన్ .టి .ఆర్ పేరుతో ఏ కార్యక్రమం మొదలు పెట్టిన నిర్విఘ్నంగా జరుగుతుందని చెప్పారు . అన్న గారి శతాబ్ది సంవత్సరంలో మా కమిటీ , ఎన్ .టి .ఆర్ .శాసన సభ ప్రసంగాలు , ఎన్ .టి .ఆర్ .చారిత్రిక ప్రసంగాలు , శకపురుషుడు ప్రత్యేక సంచికను వెలువరించాము . విజయవాడ , హైదరాబాద్ లో రెండు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి అన్న గారికి ఘనమైన నివాళి అర్పించాము .
ఇప్పుడు ఎన్ .టి .ఆర్ .స్మారక నాణెం రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని తెలిసి ఎంతో సంతోషిస్తున్నామని ఆయన తెలిపారు . దేశంలో ఇప్పటి వరకు 200 నాణేలను విడుదల చెయ్యగా ,అందులో అన్నగారి స్మారక నాణెం ప్రథమ శ్రేణిలో ఉండటం మాకు గర్వకారణం , ఇది గిన్నెస్ రికార్డు సృష్టించాలని మేము కోరుకుంటున్నామని జనార్దన్ చెప్పారు .
శ్రీనివాస్ గుండపనేడు మాట్లాడుతూ , రామారావు గారంటే మా అందరికీ అభిమానం , కేంద్రం వారి స్మారక నాణెం విడుదల చెయ్యాలని సంకల్పించిందని మాకు సమాచారం రాగానే హైదరాబాద్ మింట్ లో పనిచేసే మాకు ఎంతో సంతోషం కలిగింది , ఎందుకంటే ఇది హైద్రాబాద్లో తాయారు కాబోతున్న తొలి నాణెం , మా చీఫ్ జనరల్ మేనేజర్ నాయుడు గారి పర్యవేక్షణలో అనేక నమునాలను చేసి అత్యుత్తమ డిజైన్ ను ఎంపిక చేయడం జరిగింది , ఇది అందరికీ నచ్చడం మాకు ఎంతో సంతృప్తిని కలిగించిందని చెప్పారు .
తానాజీ మాట్లాడుతూ , నేను తెలుగు వాడిని కాదు ,అయినా రామారావు గారి గురించి విన్నాను, వారి స్మారక నాణెం హైదరాబాద్ మింట్ నుంచి వస్తున్నదంటే ఎంతో మంది ద్రుష్టి ఉంటుంది , అందుకే ఎలాంటి విమర్శలు , అసంతృప్తులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, మా కృషి ఫలించిందని చెప్పారు . ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కంఠంనేని రవి శంకర్ , భగీరథ , విక్రమ్ పూల , దొప్పలపూడి రామ్ మోహన్ , మండవ సతీష్ పాల్గొన్నారు .