దొరస్వామి మృతి: ఎన్టీఆర్, రాజమౌళి భావోద్వేగం

విజయ మారుతీ క్రియేషన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, మాజీ ఎమ్మెల్యే వి.దొరస్వామి రాజు ఇవాళ ఉదయం మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తాజాగా దొరస్వామిరాజుకి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు.

NTR TRIBUTES TO DORASWAMI

‘దొరస్వామి రాజు గారు ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ఒక నిర్మాత గా, పంపిణీదారుడి గా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. సింహాద్రి చిత్ర విజయం లో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

ఇక రాజమౌళి స్పందిస్తూ.. ‘డిస్ట్రిబ్యూటర్‌గా వెయ్యికి పైగా సినిమాలను దొరస్వామి రాజు గారు విడుదల చేశారు. కొన్ని అద్భుతమైన మరపురాని తెలుగు సినిమాలను కూడా ఆయన నిర్మించారు. వీఎంసీ బ్యానర్‌ నుంచి వచ్చిన ఆణిముత్యాల్లో ‘సీతారామయ్య గారి మనవరాలు’, ‘అన్నమయ్య’ లాంటి చిత్రాలు కొన్ని. నా కెరీర్‌ను మలుపు తిప్పిన ‘సింహాద్రి’ సినిమాకు ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

ఇక తెలుగు సినీ పరిశ్రమ ఒక మంచి డిస్ట్రిబ్యూటర్, నిర్మాతను కోల్పోయిందని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వ్యాఖ్యానించారు.