BIG BREAKING:డ్రగ్స్ కేసులో కరణ్ జోహార్‌కు నోటీసులు

బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతూనే ఉంది. ఈ కేసులో తవ్వేకొద్దీ డొంక కదులుతోంది. తాజాగా ఈ కేసులో బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, డైరెక్టర్ కరణ్ జోహర్‌కు షాక్ తగిలింది. ఆయనకు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB)నోటీసులు జారీ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. కరణ్ జోహర్ ఇప్పటివరకు నిర్వహించిన పార్టీలకు సంబంధించిన వివరాలు అందించాలని నోటీసుల్లో ఎన్సీబీ పేర్కొంది. బాలీవుడ్‌లో కరణ్ జోహర్ ఎక్కువగా పార్టీలు నిర్వహిస్తూ ఉంటారు. ఆయన నిర్వహించే పార్టీలకు పెద్ద పెద్ద బాలీవుడ్ సెలబ్రెటీలందరూ హాజరవుతూ ఉంటారు.

KARAN JOHAR

ఇప్పుడు పార్టీల వివరాలు సమర్పించాలని కరణ్‌ను ఎన్సీబీ కోరడం బాలీవుడ్‌లో సంచలనం రేపుతోంది. కరణ్ జోహర్ నిర్వహించే పార్టీలలో డ్రగ్స్ కూడా అందుబాటులో ఉంటాయని, చాలామంది సెలబ్రెటీలు ఈ పార్టీలకు వచ్చి డ్రగ్స్ తీసుకుంటారనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ క్రమంలో కరణ్ జోహర్ నిర్వహించిన పార్టీల వివరాలను సమర్పించాలని ఎన్సీబీ కోరడంతో ఈ కేసులో మరో కీలక ములుపు చోటుచేసుకునే అవకాశముందని వార్తలొస్తున్నాయి. మరికొంతమంది సెలబ్రెటీల బాగోతాలు బయటపడే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

కరణ్ జోహర్‌ను త్వరలో విచారణకు పిలిచే అవకాశముందని, అరెస్ట్ చేస్తారని నేషనల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఈ డ్రగ్స్ కేసు తెరపైకి రాగా.. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తితో పాటు పలువురిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవలే బెయిల్‌పై రియా బయటికొచ్చింది. ఇక గత కొద్దిరోజుల క్రితం ఈ కేసులో హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొణే, సారా అలీఖాన్‌, శ్ర‌ద్దాక‌పూర్‌లకు ఎన్సీబీ నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. ఇంతలోపే కరణ్‌కు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.