డ్రగ్స్ కేసులో మరో నటుడికి షాక్

బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు సంచలనం రేపుతూనే ఉంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేయగా.. తాజాగా మరో నటుడికి షాకిచ్చింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్‌కి డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు తాజాగా సమన్లు జారీ చేశారు. రేపు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే నవంబర్ 13న డ్రగ్స్ కేసులో అర్జున్ రామ్‌పాల్‌ని అధికారులు ప్రశ్నించారు. అతడితో పాటు అతడి ప్రియురాలు గాబ్రియల్లా డెమెట్రయేడ్స్‌ను కూడా అప్పట్లో రెండు రోజుల పాటు ప్రశ్నించారు.

ARJUN RAMPAL

అలాగే నవంబర్ 10న అర్జున్‌పాల్ ఇంట్లో తనిఖీలు కూడా చేశారు. ఈ సందర్భంగా నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ కూడా చేశారు. దీంతో పాటు ఈ కేసులో అర్జున్ డ్రైవర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి అర్జున్‌పాల్‌కి పోలీసులు సమన్లు జారీ చేయడం సంచలనంగా మారింది. దీనిని బట్టి చూస్తే డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు స్పీడ్ పెంచారని అర్థమవుతోంది.

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేయగా.. తాజాగా ఆమె బెయిల్‌పై బయటికి వచ్చింది. ఇక ఈ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొణే, శ్రద్ధాకపూర్, సారా అలీ ఖాన్‌లకు సమన్లు జారీ చేసింది. దీంతో గత కొద్దిరోజుల క్రితం ఈ నలుగురు విచారణకు హాజరయ్యారు.