కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ ఫస్ట్ లుక్ విడుదల

Miss India movie first look

అల‌నాటి మ‌హాన‌టి సావిత్రి పాత్ర‌లో త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించి అంద‌రితో శ‌భాష్ అనిపించుకోవడమే కాదు.. జాతీయ ఉత్తమనటి అవార్డును సొంతం చేసుకున్న హీరోయిన్ కీర్తిసురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తోన్న చిత్రానికి ‘మిస్ ఇండియా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌రేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్ నటిస్తున్న తెలుగు చిత్రమిదే. ఈ చిత్రం యూరప్‌లో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ సందర్బంగా ….

నిర్మాత మ‌హేష్ కోనేరు మాట్లాడుతూ – “`మ‌హాన‌టి` చిత్రంతో కీర్తిసురేష్ తెలుగువారి హృద‌యాల్లో ఎంత‌టి స్థానం సంపాదించుకుందో తెలిసిందే. అలాగే ఉత్తమనటిగా జాతీయ అవార్డుని దక్కించుకుని మనకు గర్వకారణమయ్యారు. ఆమె జాతీయ అవార్డు గెలుచుకున్న తర్వాత నటిస్తున్న తొలి చిత్రం మా బ్యానర్‌లోనే కావడం మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ చిత్రానికి ‘మిస్ ఇండియా’ అనే టైటిల్‌ను ఖరారు చేశాం. దాని లుక్‌ను విడుదల చేశాం. ఆమె నుండి ఇప్పుడు ప్రేక్షకులు ఎలాంటి సినిమా రావాలని కోరుకుంటారో అలాంటి సినిమానే ‘మిస్ ఇండియా’.  ప్ర‌తి అమ్మాయి త‌న జీవితంలో  ఎక్క‌డో ఒక‌చోట ఇలాంటి సిచ్యువేష‌న్‌ను ఎదుర్కొనే ఉంటుంది. మ‌హిళ‌లు సహా అన్ని వర్గాల ప్రేక్షకులకు క‌నెక్ట్ అవుతుంది. సినిమా షూటింగ్ మేజర్ పార్ట్ పూర్తయ్యింది. మిగిలిన చిత్రీకరణను కూడా ప్లానింగ్ ప్రకారం పూర్తి చేసి సినిమాను అక్టోబర్ లేదా నవంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. 

ద‌ర్శ‌కుడు నరేంద్ర మాట్లాడుతూ – “అన్ని ఎమోష‌న్స్ క‌ల‌గ‌లిపిన సినిమాయే ‘మిస్ ఇండియా’.  కథ రాసుకున్న తర్వాత.. ఈ క‌థ‌కు కీర్తిసురేష్‌గారు మాత్రమే న్యాయం చేయగలరని నేను, మా నిర్మాత మహేశ్‌గారు భావించి ఆమెను కలిసి కథను వినిపించాం. ఆమెకు చాలా బాగా నచ్చి ఒప్పుకున్నారు. ఆమె సహకారంతో సినిమాను అనుకున్న ప్లానింగ్‌లో పూర్తి చేస్తున్నాం. రీసెంట్‌గా ఈ సినిమా యూరప్‌లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కొన్నిరోజుల షూటింగ్ మాత్రమే జరగాల్సి  ఉంది. కుటుంబ క‌థా ప్రేక్ష‌కులు స‌హా అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే సినిమా ఇది’’ అన్నారు.