పిశాచి, డిటెక్టివ్ హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడి మ‌రో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్..

పిశాచి, డిటెక్టివ్ లాంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించిన ద‌ర్శ‌కుడు మిస్కిన్ నుంచి మ‌రో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ రాబోతుంది. ద‌ర్శ‌కుడు మిస్కిన్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం మిస్కిన్ సైకో. ఈ సినిమాలో ఉద‌య‌నిధి స్టాలిన్‌, అదితిరావు హైద‌రి, నిత్యామీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌లుగా పోషిస్తుండ‌గా.. డీఎస్ సినిమాస్ బ్యాన‌ర్‌పై డి. శ్రీ‌నివాస్‌రెడ్డి ఈ మూవీని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం.

ఈ సంద‌ర్భంగా నిర్మాత డి. శ్రీ‌నివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. వైవిధ్య‌భ‌రిత‌మైన సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తార‌ని పేర్కొన్నారు. కొత్త ద‌నాన్ని కోరుకునే తెలుగు ప్రేక్ష‌కుల కోసం మిస్కిన్ సైకో సినిమాని తీసుకువ‌స్తున్నామ‌ని.. డైరెక్ట‌ర్ మిస్కిన్ ఎంతో ప్ర‌తిభావంత‌మైన ద‌ర్శ‌కుడు అని అన్నారు. ఆయ‌న త‌మిళ్‌లో తీసిన సినిమాలు తెలుగులో వ‌చ్చినా డిటెక్టివ్ చిత్రం ఎంతో సంచ‌ల‌న విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిన విష‌య‌మే.. ఇందులో హీరో విశాల్ త‌న న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకునేలా చేసిన డైరెక్ట‌ర్ మిస్కిన్ నుంచి వ‌స్తున్న మ‌రో స‌స్పెన్స్ చిత్ర‌మిద‌ని.. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను వెల్ల‌డిస్తామ‌ని పేర్కొన్నారు. ఇక ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా స్వ‌రాలు అందిస్తున్నారు.