

తెలుగు చిత్రపరిశ్రమలో ఎవరెస్ట్ శిఖరం మెగాస్టార్ చిరంజీవి. వెండితెరపై నటనతో పాటు డాన్సులతోనూ అలరించే ఆయన చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ను స్థాపించి తన అభిమానుల సహకారంతో ఎనలేని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి మానస పుత్రిక అయిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఎందరో రక్తదానం చేస్తుంటారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ రక్తదానం చేసి చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇలా మణిశర్మ రక్తదానం చేయటం ఇది రెండోసారి కావటం విశేషం.
‘ రక్తదానం ’తో లక్షలాది ఆపన్నుల ప్రాణాలు నిలపాలన్న చిరంజీవి ఆశయాన్ని తమ సంకల్పాన్ని భావించి రక్తదానం చేసిన అభిమానులెందరో.. వారిలో తన స్వరాలతో ప్రేక్షకుల్ని మైమరపించే స్వరబ్రహ్మ ‘మణిశర్మ’ ఒకరు. చిరంజీవి పిలుపును కర్తవ్యంగా భావించి నేడు ఈ మహత్కార్యంలో భాగమై రక్తదానం చేసిన మణిశర్మ మరెందరికో స్ఫూర్తిగా నిలిచారు. పాటలకు స్వరాలు కూర్చడమే కాదు.. మానవత్వానికి చిరునామాగా నిలవడమూ తెలుసునని నిరూపించారు మణిశర్మ.

ఈ సందర్భంగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ మాట్లాడుతూ ‘‘ఎఫ్పటి నుంచో రక్త దానం చేయాలని అనుకుంటున్నాను. నేను నా సంగీతాన్ని చిరంజీవిగారి సినిమాలకు అందించటం ద్వారా అభిమానాన్ని చాటుకున్నాను. ఇప్పుడు రక్తదానం చేయటం అనేది సంతోషంగా ఉంది.. నా వంతు కర్తవ్యంగా భావిస్తున్నాను. లక్షలాది మంది ఇందులో భాగమైయ్యారు. అందులో నేను ఒక బొట్టులాగా ఇప్పుడు చేరాను. ఇలాంటి మంచి కార్యక్రమంలో అందరూ భాగం కావాలి’’ అన్నారు.