టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ రూ. లక్ష సాయం!!

నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయాల తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేశారు.  మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానంతో సినిమా రంగానికి వచ్చిన టీఎన్ఆర్ తనదైన మార్గాన్ని ఎంచుకుని ఎదిగారు. టీఎన్ఆర్ మరణవార్త తెలిసిన మెగాస్టార్ చిరంజీవి తన దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం టీఎన్ఆర్ భార్యా పిల్లలకు ఫోన్ చేసి పరామర్శించారు. దాంతోపాటు లక్షరూపాయల తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేశారు.

టీఎన్ఆర్ చేసిన ఎన్నో ఇంటర్వ్యూలు తాను చూశానని, తను ఇంటర్వ్యూ చేసే విధానం తనను ఎంతో ఆకట్టుకునేదని గుర్తుచేశారు. జీవితంలో పట్టుదలతో ఎదిగిన టీఎన్ఆర్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ కుటుంబానికి ఎలాంటి అవసరమొచ్చినా తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.

మీరంటే వీరాభిమానం: చిరుతో టీఎన్ఆర్ భార్య

‘మీరంటే వీరాభిమానం సార్. తన 200వ ఇంటర్వ్యూ మీతోనే చేయాలని అనుకునేవారు. ఇంతవరకు మిమ్మల్ని కలవలేదు. మీరు మాకిలా ఫోన్ చేయడం ఎంతో సంతోషం కలిగించింది’ ఈ మాటలు మరెవరివో కాదు టీఎన్ఆర్ సతీమణివి. ఆమె భర్త మరణించిన విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి మంగళవారం ఆమెకు ఫోన్ చేసి పరామర్శించగానే ఆమె అన్న మాటలివి.తమ కుటుంబానికి లక్ష రూపాయల తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.