మెగాస్టార్ చిరంజీవి 153 వ సినిమా `లూసీఫ‌ర్` రీమేక్ కి దర్శకుడు మోహ‌న్ రాజా!!

సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ న‌టించిన మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ లూసీఫర్ తెలుగు రీమేక్ లో న‌టించేందుకు మెగాస్టార్ చిరంజీవి స‌ర్వ‌స‌న్నాహ‌ల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆచార్య చిత్రీక‌ర‌ణ సాగుతుండ‌గానే 153 వ సినిమాగా రానున్న ఈ మూవీ స్క్రిప్టును ద‌ర్శ‌కుడిని ఫైన‌ల్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. వచ్చేనెల జనవరి 2021 సంక్రాంతి త‌ర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతున్న ఈసినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ లూసీఫ‌ర్ సినిమా స్క్రిప్టు ఫైన‌ల్ అయ్యింది. `త‌నిఒరువ‌న్` (ధృవ‌) ఫేం మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. రీమేక్ క‌థ ఓకే అయ్యింది. మన నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క స్క్రిప్టును మోహ‌న్ రాజా చాలా బాగా నేరేట్ చేశాడు. సంక్రాంతి త‌ర్వాత సెట్స్ కెళ‌తాం. ఫిబ్ర‌వ‌రి-మార్చి - ఏప్రిల్ లో జరిగే షూటింగ్ తో ఈ 153 వ సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. నాతో సినిమా చేయాల‌ని వేచి చూస్తున్న‌ చిర‌కాల స‌న్నిహితులు ఎన్వీ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నా సినిమాల పంపిణీదారుడిగా ఆయ‌నతో ఎంతో అనుబంధం ఉంది అని తెలిపారు.

ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా మాట్లాడుతూ-మెగాస్టార్ చిరంజీవి గారు న‌టించిన హిట్ల‌ర్ (ముత్యాల సుబ్బ‌య్య ద‌ర్శ‌కుడు‌) చిత్రానికి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశాను. ఇప్పుడు ఆయ‌న‌ను డైరెక్ట్ చేసే అవ‌కాశం అదృష్ఠం ద‌క్క‌డం పూర్వ‌జ‌న్మ సుకృతం. ఈ అవ‌కాశం ద‌క్కినందుకు ఆనందంగా ఉంది. ఎన్వీ ప్ర‌సాద్ గారు నిర్మాత‌గా రాజీ లేకుండా తెర‌కెక్కించ‌నున్నారు అని తెలిపారు.

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అండ్ ఎన్.వి. ప్ర‌సాద్ (ఎన్ .వి.ఆర్ సినిమా) సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా గురించి నిర్మాత ఎన్.వి. ప్ర‌సాద్ మాట్లాడుతూ.. చిరంజీవి గారి సినిమాని మోహ‌న్ రాజా తెర‌కెక్కించ‌డం చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి వారితో పాటుగా మా అందరికీ న‌చ్చేలా మార్పులు చేర్పుల‌తో ఎంతో అద్భుతంగా ఈ స్క్రిప్టును మ‌లిచి మోహ‌న్ రాజా మెప్పించారు. బాస్ తో సినిమా అంటేనే కొత్త ఉత్సాహం అంద‌రిలో నెల‌కొంది. రాజీ ప‌డ‌కుండా భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం అని తెలిపారు.

మోహ‌న్ రాజా ప్ర‌ఖ్యాత ఎడిట‌ర్ మోహ‌న్ వార‌సుడిగా సుప‌రిచితం. ఆయ‌న త‌మిళంలో పాపుల‌ర్ డైరెక్ట‌ర్. ఐదు తెలుగు సినిమాల్ని త‌మిళంలోకి రీమేక్ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్లు చేసిన రికార్డ్ త‌న‌కు ఉంది. ఎడిట‌ర్ మోహ‌న్ నిర్మించిన హిట్ల‌ర్ సినిమాకి ముత్యాల సుబ్బ‌య్య వ‌ద్ద మోహ‌న్ రాజా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశారు. ఇప్పుడు చిరంజీవిని డైరెక్ట్ చేసే అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటార‌నే అభిమానులు భావిస్తున్నారు. త‌మిళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన త‌ని ఒరువ‌న్ (జ‌యం ర‌వి హీరో) ద‌ర్శ‌కుడిగా అత‌డి పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. రామ్ చ‌ర‌ణ్ హీరోగా సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ధృవ టైటిల్ తో త‌నిఒరువ‌న్ రీమేకై తెలుగులోనూ ఘ‌న‌విజ‌యం సాధించిన విషయం తెలిసిందే.