‘మాధవే మధుసూదన’ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం.. దర్శక నిర్మాత బొమ్మదేవర రామచంద్ర రావు !!

తేజ్ బొమ్మదేవర, రిషికి లొక్రే‌ జంటగా నటించిన సినిమా ‘మాధవే మధుసూదన’. ఈ చిత్రాన్ని సాయి రత్న క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తూ దర్శకత్వం వహించారు బొమ్మదేవర రామచంద్ర రావు. ఈ మూవీని బొమ్మదేవర శ్రీదేవి సమర్పిస్తున్నారు. ఈ నెల 24 ‘మాధవే మధుసూదన’ సినిమా థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత బొమ్మదేవర రామచంద్ర రావు మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే..

మేకప్ మెన్‌గా పని చేసిన మీరు దర్శకుడిగా, నిర్మాతగా ఎలా మారారు?

మన్మథుడు సినిమా టైంలో నాగార్జున గారికి నేను దర్శకుడిని కావాలని అనుకుంటున్నట్టుగా ఆయనకు చెప్పాను. నీ మెంటాల్టీకి దర్శకుడు అంటే కష్టం కానీ.. నిర్మాతగా ట్రై చేయ్ అని సలహా ఇచ్చారు. సూపర్ సినిమా టైంలో అనుష్క గారికి మేకప్ వేస్తూ.. మీరు పెద్ద హీరోయిన్ అవుతారు.. అప్పుడు నాకు డేట్స్ ఇవ్వాలని అన్నాను. అలా చాలా మందిని అడిగాను. కానీ అనుష్క మాటను నిలబెట్టుకున్నారు.

మాధవే మధుసూదన సినిమాకు హీరోగా ఫస్ట్ ఛాయిస్ ఎవర్ని అనుకున్నారు?

చాలా మంది హీరోలను అడిగాను. కానీ మేకప్ మెన్ నుంచి దర్శకుడు, నిర్మాతగా మారుతున్నాను అంటూ చాలా మంది నమ్మరు. వేరే వాళ్లతో రిస్క్ ఎందుకు అని నా కొడుకుని అడిగితే.. హీరోగా చేస్తానని అన్నాడు. ఓ ఏడాది ట్రైనింగ్ ఇప్పించి హీరోగా పెట్టుకున్నాను. ఎక్కడా కొత్త కుర్రాడు నటించినట్టుగా అనిపించదు. నా కొడుకుని హీరోగా పెడదామని అయితే సినిమాను స్టార్ట్ చేయలేదు.

డైరెక్టర్, నిర్మాతగా మీకు ఎదురైన సవాళ్లు ఏంటి? బడ్జెట్ ఏమైనా పెరిగిందా?

స్క్రీన్ మీద ఏం చూపించాలనేది దర్శకుడికి తెలుస్తుంది.. అదే టైంలో బడ్జెట్ గురించి నిర్మాత టెన్షన్ పడుతుంటాడు. కానీ ఇక్కడ ఆ రెండూ నేనే. ముందే ఓ బడ్జెట్ అనుకున్నాను. అంతలోనే తీశాను. ఏడాదిన్నర స్క్రిప్ట్ మీద కూర్చున్నాను. కావాల్సిందే రాసుకున్నా. కావాల్సిందే తీశాను.

ఈ స్టోరీకి మూలం ఎక్కడ పుట్టింది?

ఆజాద్ సినిమా టైంలో నాగార్జున గారి కోసం నేను కాచిగూడ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాను. ఆయన వచ్చారని ఎవరో అన్నారు. పరిగెత్తుకుంటూ వెళ్లి చూశాను. కానీ ఆయన రాలేదు. అలా ఓ మనిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటే.. వాళ్లు రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందనే ఆలోచనలోంచే ఈ కథ పుట్టింది. వెయిట్ చేసి వెయిట్ చేసి రాకపోవడం, 25 ఏళ్ల తరువాత ఆ మనిషి వస్తే పరిస్థితి ఏంటి? అన్నది ఈ సినిమాలో చూపించాం.

ఈ కథకు హీరోయిన్‌ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

డైరెక్టర్ తేజ తన అహింస సినిమా కోసం ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. కానీ తేజ చిత్రంలో తీసుకోలేదు. నాకు ఆ అమ్మాయి గురించి తెలిసిందే. నేను హీరోయిన్‌గా పెట్టుకున్నాను. ఆమె జాన్వీ కపూర్‌లా ఉందని అందరూ అంటుండేవారు.

మీ అబ్బాయి తేజ్‌కి ముందు నుంచీ హీరోగా చేయాలని ఉండేదా?

తేజ్‌కి హీరో అవ్వాలని ఉండేది. నేను ఈ సినిమా కథ చెప్పడంతోనే ఎగిరి గంతేశాడు. చాలా ట్రైనింగ్ తీసుకున్నాడు. డ్యాన్సుల, ఫైట్స్ కోసం శిక్షణ తీసుకున్నాడు.

ఫ్యామిలీ ఆడియెన్స్ చూసేలా సినిమా ఉంటుందా?

కుటుంబం అంతా కలిసి చూసేలా ఈ చిత్రం ఉంటుంది.. అమ్మా, అక్కా, చెల్లి, తల్లిదండ్రులు ఇలా అందరూ కలిసి చూడే చిత్రాన్ని తీయాలని అనుకున్నాను. అలాంటి సినిమానే తీశాను.

మీ ఈ సినిమాకు నాగార్జున, అక్కినేని ఫ్యామిలీ, ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది?

నాగార్జున గారు ముందు నుంచీ నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నాగ చైతన్య, అఖిల్, మంచు విష్ణు, బ్రహ్మానందం ఇలా ఎంతో మంది సహాయం చేయడం వల్లే సినిమా ఇక్కడి వరకు వచింది.