ఖుష్బూ ప్రయాణిస్తున్న కారుకు ఘోర రోడ్డు ప్రమాదం

సినీయర్ హీరోయిన్ ఖుష్బూ ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. తమిళనాడులోని మెల్మార్‌వత్తూర్ దగ్గర ఖుష్బూ ప్రయాణిస్తున్న కారును ఓ ట్యాంకర్ స్పీడ్‌గా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఖుష్బూ ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయింది. అయితే డ్రైవర్ చాకచక్యంతో ఈ ప్రమాదం నుంచి ఖుష్బూ బయటపడంతో ఆమెకు పెను ప్రమాదం తప్పినట్టయింది.

kushbu

అదృష్టం కొద్దీ ఈ ప్రమాదంలో తాను ప్రాణాలతో బయటపడ్డానని ఖుష్బూ ట్వీట్ చేసింది. తాను సేఫ్‌గా ఉన్నానని, ప్రమాదం జరిగింది కదా అని ఆగిపోకుండా తన కడలూరు ప్రయాణాన్ని కొనసాగించానని ఖుష్బూ ట్విట్టర్‌లో పేర్కొనడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పిన ఖుష్బూ.. మురుగన్ దేవుడు తమను కాపాడాడని, తన భర్త దేవుడిపై పెట్టుకున్న నమ్మకం ఇప్పుడు బయటపడిందని తెలిపింది. అయితే మొన్నటివరకు కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ఖుష్బూ ఇటీవలే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటోంది.