‘ఆదిపురుష్’‌లో సీత ఎవరో తెలిసిపోయింది

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ సినిమాకి సంబంధించిన ప్రతివార్త హాట్‌టాపిక్‌గా మారుతూ ఉంటుంది. పౌరాణిక గాథల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటించనున్నాడు. విలన్ అయిన రావణుడి పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు సైప్ అలీఖాన్ నటించనుండగా.. రాముడి భార్య అయిన సీత పాత్రలో ఎవరు నటిస్తారనేది ఇంకా కన్ఫార్ప్ కాలేదు. ఈ పాత్ర కోసం అనేకమంది హీరోయిన్లను సినిమా యూనిట్ పరిశీలించింది.

ADIPURUSH

దీపికా పదుకొణే, అనుష్క శర్మ, అనుష్క శెట్టి, కీర్తి సురేష్, కియారా అద్వానీ పేర్లు వినిపించాయి. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సీత పాత్ర కోసం కృతిసనన్ పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కృతిసనన్ రాజ్‌కుమార్‌తో కలిసి హమ్ దో సినిమాలో నటిస్తోంది. దీని తర్వాత ఆదిపురుష్ సినిమాలో నటించనుంది. ఇక లక్ష్మణ్, హనుమాన్, విభీషణ్ పాత్రల గురించి ఇంతవరకు సమాచారం వెలువడలేదు.

ఆదిపురుష్ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఔం రౌత్ తెరకెక్కిస్తుండగా.. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్‌తో దీనికి తెరకెక్కిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళ బాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. పాన్ ఇండియాపై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. రాధాకృష్ణకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. దీని తర్వాత ఆదిపురుష్ షూటింగ్‌లో ప్రభాస్ పాల్గొనే అవకాశముంది.