టాలీవుడ్‌కు కేసీఆర్ గుడ్‌న్యూస్

తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇవాళ ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ను నాగార్జున‌, చిరంజీవి, ప‌లువురు సినీ పెద్ద‌లు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా క‌రోనా కార‌ణంగా ఇండ‌స్ట్రీకి చాలా న‌ష్టం జ‌రిగింద‌ని, ప్ర‌భుత్వ ప‌రంగా ఆదుకోవాల‌ని కోరారు. క‌రోనా కార‌ణంగా జ‌రిగిన న‌ష్టాన్ని కేసీఆర్‌కు వివ‌రించారు. దీంతో వీటిపై సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. కోవిడ్ కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూసి వేయడం వల్ల పరిశ్రమకు, కార్మికులకు జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి ప్రభుత్వ పరంగా రాయితీలు, మినహాయింపులు ఇస్తామ‌ని కేసీఆర్ తీపిక‌బురు అందించారు.

రాష్ట్రానికి పరిశ్రమలు తరలి రావడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంద‌ని, అలాంటిది ఉన్న పరిశ్రమను కాపాడుకోకపోతే ఎలా? అని కేసీఆర్ చెప్పారు. దేశంలో ముంబాయి, చెన్నైతో పాటు హైదరాబాద్ లోనే పెద్ద సినీ పరిశ్రమ ఉందని, లక్షలాది మందికి ఈ పరిశ్రమ ద్వారా ఉపాధి దొరుకుతుందన్నారు. కోవిడ్ కారణంగా సినీ పరిశ్రమకు ఇబ్బంది కలిగిందని, ఈ పరిస్థితుల్లో పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఇటు ప్రభుత్వం, అటు సినిమా పరిశ్రమ పెద్దలు కలిసి పరిశ్రమను కాపాడుకోవడానికి సంయుక్త ప్రయత్నాలు చేయాలని సూచించారు. ప్రభుత్వ పరంగా సినీ పరిశ్రమను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామ‌న్న కేసీఆర్.. జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ విడుదల చేసే మానిఫెస్టోలో సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తామ‌న్నారు.

సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ధిపై కేసీఆర్‌తో జ‌రిగిన స‌మావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రముఖ సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున, ఫిలిం ఛాంబర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నారాయణ్ దాస్ నారంగ్, కెఎల్ దామోదర్ ప్రసాద్, నిర్మాతల సంఘం అధ్యక్షుడు సి.కళ్యాణ్, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, నిర్మాత నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే త్వరలోనే సినీ హీరో చిరంజీవి ఇంట్లో మరోసారి సమావేశమై సినిమా పరిశ్రమ అభివృద్ధిపై మరింత విస్తృతంగా చర్చించాలని నిర్ణయించారు.