`తెల్లవారితే గురువారం` సినిమా సక్సెస్ అయ్యి.. మా భైరవ, సింహా ఇంకో మెట్టు ఎక్కేలా ఈ మూవీ దోహదపడాలి – యంగ్ టైగర్ ఎన్టీఆర్.

తొలి చిత్రం ‘మత్తు వదలరా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యువ నటుడు శ్రీ సింహా కోడూరి. ఆయ‌న హీరోగా మణికాంత్ జెల్లీ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం తెల్లవారితే గురువారం. రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతలు. కాల భైరవ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 27న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సంద‌ర్భంగా మార్చి 21న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.


ఎడిటర్ సత్య మాట్లాడుతూ.. ‘సినిమా నిడివి రెండు గంటలే. చిత్రాన్ని పరిగెత్తించాం. థియేటర్లో ప్రేక్షకులు నవ్వి నవ్వి కింద పడిపోతారు’ అని చెప్పుకొచ్చారు.


దర్శకుడు మణికాంత్ మాట్లాడుతూ.. ‘మార్చి 27న తెల్లవారితే గురువారం మూవీ రాబోతోంది. యూత్ అయితే అరవింద సమేతతో వెళ్లండి.. ఫ్యామిలీ అయితే సకుటుంబ సమేతంగా రండి. సినిమాను చూస్తే అదుర్స్ అనిపించేలా చేస్తాం. నా మొదటి సినిమాకు తారక్ అన్న గెస్ట్‌లా రావడం కలలా ఉంది. నేను దేవుడిని నేను బాగా నమ్ముతాను. అందులో ఒకరు సింహాచలంలో ఉంటే.. ఇంకొకరు కేరళ శబరిమలైలో ఉన్నారు. కానీ నేను అభిమానించే హీరో ఆంద్రలో సింహాద్రిలా కేరళలో సింగమలైలా ఉంటారు. తెల్లవారితే గురువారం అనే సినిమాకు వస్తే.. ఉదయం 4 40 నిమిషాలకు వరుడు వీరేంద్ర పెళ్లి. కానీ ఎవరో తెలీదు’ అని చెప్పుకొచ్చారు.


కీరవాణి మాట్లాడుతూ.. ‘ఇది మా అబ్బాయి రెండో సినిమా. మొదటి సినిమా అయినా రెండో సినిమా అయినా మూడో సినిమా అయినా కూడా దర్శకులు చెప్పింది విని స్టూడెంట్స్‌లా ఎంతో నేర్చుకోవాలి.. అందుకే స్టూడెంట్ నెంబర్ వన్ అయిన ఎన్టీఆర్ ఆశీర్వదించేందుకు వచ్చారు. సినిమాకు మంచి రిపోర్ట్ వస్తే.. సాయి గారు మీ ఇంటికి బ్రేక్ ఫాస్ట్‌కు వస్తాను. మంచి ఒగ్గాణి తినిపించాలి. సింహా, భైరవ ఆల్ ది బెస్ట్. ఫాదర్స్ రెండు రకాలుగా ఉంటారు. గూగుల్ మ్యాప్ ఫాదర్… ఇంట్లోంచి బయటకు వెళ్లినప్పటి నుంచి ప్రతీ ఒక్కటి చెబుతుంటారు. కానీ రెండో రకం మాత్రం.. కేవలం ఆల్ ది బెస్ట్.. కమ్ బ్యాక్ సేఫ్ అని చెబుతారు. నేనూ అదే చెబుతాను. కెరీర్ ‌ ప్రారంభించినప్పుడే సింహా, భైరవకు అన్నీ చెప్పాను. ఈ సినిమా కథ కూడా నాకు తెలీదు.. అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.


రాజమౌళి మాట్లాడుతూ.. ‘టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ బాగున్నాయి. అయితే ఇంట్లో వాళ్లు ఏ కొంచెం చేసినా కూడా బాగుందని మాకు అనిపిస్తుంది. కానీ అసలు విషయం మీరు చెప్పాలి. సినిమా ఎలా ఉందనే విషయం మీరు శుక్రవారం చెప్పాలి. భైరవ విషయంలో నాకు ఎలాంటి భయం లేదు. వాడు క్లాస్ మాస్ అయినా ఇరగ్గొట్టేస్తున్నాడు. ఇక మా చిన్నోడి గురించి మీరు చెప్పాలి.. ట్రైలర్, టీజర్ చూస్తేనే సినిమా చాలా రిచ్‌గా ఉందని తెలుస్తోంది. నిర్మాతలు అద్భుతంగా నిర్మించారు. మొదటి సినిమా అయినా కూడా దర్శకుడు బాగా తీశాడు’ అని అన్నారు.


ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘జీవితంలో మొదటిసారిగా మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నాను. మీరు (అభిమానులు) అరిస్తే ఎనర్జీ వస్తుంది. ఇలా చాలా తక్కువ సార్లు ఇబ్బంది పడుతుంటాను.. రేపొద్దున అభయ్, భార్గవ్ గానీ ఏదైనా సాధిస్తే వాళ్ల గురించి చెప్పాలంటే మాట్లాడలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఇప్పుడు తెలుస్తోంది. పిల్లలు సక్సెస్ అయితే తల్లిదండ్రులు ఎలా ఫీలవుతారో.. నా తమ్ముళ్లు సింహా, భైరవ సాధించిన విజయాలకు మాటలు సరిపోవడం లేదు. వారి గురించి చెప్పేందుకు మాటలు సమకూర్చుకుంటున్నాను. రేపొద్దున భార్గవ్, అభయ్‌ను చూసి కూడా ఎంతో సంబరపడతానేమో. నాకు 20 ఏళ్ల నుంచి దేవుడి ఇచ్చినట్టువంటి శక్తి మీరైతే.. నాకు తెలిసిన ఒకే ఒక కుటుంబం కీరవాణి, జక్కన్న కుటుంబం. నేను తీసుకునే ప్రతీ ఒక్క నిర్ణయం వెనక వాళ్లే ఉన్నారు. ఈ కుటుంబానికి నేను ఎప్పుడూ గెస్ట్‌ను కానూ కాకూడదు.. వారికి కూడా నేను అలా కాకూడదు. నిర్మాత సాయి గురించి కూడా అంతే ఫీలవుతున్నాను. సాయి అన్నతో 30 ఏళ్ల పరిచయం ఉంది. నాన్న గారితో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారు. ఆయన గురించి, సక్సెస్ గురించి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. మన అనుకున్న వాళ్ల గురించి ఎక్కువగా మాట్లాడలేం. సినిమా సక్సెస్ అవ్వాలి.. మా భైరవ, సింహలకు ఇంకో మెట్టు ఎక్కేలా ఈ మూవీ దొహదపడాలి. ఈ మూవీ హిట్ అవ్వాలి.. దర్శకుడికి సక్సెస్ రావాలి.. సినిమాకు పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. మంచి తల్లిదండ్రులం అని ఎలా అనిపించుకోవాలి.. పిల్లలను ఎలా మంచిగా పెంచాలని ప్రణీత, నేను రోజూ అనుకుంటూ ఉంటాం. ఆ ఇద్దరూ (సింహా, భైరవ) ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం మా వళ్లమ్మ, రమమ్మ. ప్రతీ కొడుకు సక్సెస్ వెనకా ఓ తల్లి ఉంటుంది.. మా పిల్లలకు ఉదాహరణగా చెప్పుకోవడానికి వీళ్లున్నారు. సింహా, భైరవకు సినిమాల పరంగానే విజయాలు కాకుండా రేపు వచ్చే యువతకు ఆదర్శంగా ఎదగాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. సక్సెస్ మీట్‌లో మళ్లీ కలుద్దాం’ అని అన్నారు.