హీరో వరుణ్ సందేశ్ ఇంట్లో విషాదం

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అతడి తాత, ప్రముఖ కవి జీడిగుంట రామచంద్రమూర్తి కరోనాతో మృతి చెందారు. ఆయన వయస్సు 80 ఏళ్లు. గత కొద్దిరోజుల క్రితం కరోనాతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆయన చేరారు. ఈ క్రమంలో కరోనా చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు.

తెలుగు కథ, నవల, నాటకం, వ్యాసాల్లో రామచంద్రమూర్తి ఎన్నో రచనలు చేశారు. ఆయన రచనకు పలు అవార్డులు కూడా లభించాయి. రామచంద్రమూర్తి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అలాగే కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.

రామచంద్రమూర్తి 1940లో జన్మించారు. 1960లో ఆయన తొలిసారి రచించిన హంసగమన అనే కథ ప్రచురితమైంది. ఇప్పటివరకు 300 కథలు, 40 నాటికలు, 8 నవలలు ఆయన రాశారు.