‘నట్టి క్రాంతి’ హీరోగా ”సైకో వర్మ” చిత్రం ప్రారంభం!!

ప్రముఖ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి హీరోగా నటిస్తున్న చిత్రం ”సైకో వర్మ” (వీడు తేడా).
ఇందులో హీరోయిన్లుగా కృష్ణప్రియ, సుపూర్ణ మలకర్ సందడి చేయనున్నారు. గతంలో నిర్మాతగానే కాకుండా పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన నట్టికుమార్ మళ్ళీ మెగాఫోన్ పట్టి దీనికి దర్శకత్వం వహిస్తుండటం ఓ విశేషం.


నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్, క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై శ్రీధర్ పొత్తూరి సమర్పణలో నిర్మాతలు అనురాగ్ కంచర్ల, నట్టి కరుణ నిర్మిస్తున్నారు.
కాగా ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది.
తొలి సన్నివేశానికి సీనియర్ ఫిల్మ్ ఎడిటర్ గౌతంరాజు క్లాప్ నివ్వగా… నిర్మాతలలో ఒకరైన నట్టి కరుణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.


ఈ సందర్భంగా దర్శకుడు నట్టికుమార్ మాట్లాడుతూ
…”రాంగోపాల్ వర్మ అభిమానిగా ఈ చిత్రంలోని హీరో క్రాంతి కనిపిస్తాడు. వయోలెన్స్, రొమాన్స్ అంశాలతో చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. రాంగోపాల్ వర్మ కూడా ఈ చిత్రంలో కనిపించబోవడం ఓ విశేషం. ఒకప్పుడు శివ, సర్కార్, రంగీలా వంటి అద్భుత చిత్రాలను తీసిన వర్మ ఇప్పుడు తన పంథాన్ని మార్చి తీస్తున్న విధానాన్ని పోలుస్తూ ఈ చిత్రంలో ఓ మంచి పాటను చిత్రీకరిస్తున్నాం.
”పిచ్చోడి చేతిలో రాయి… ఈ సైకో వర్మనే మన భాయి..” అంటూ సాగే ఆ లిరికల్ పాటను ఇటీవల విడుదల చేయగా… విశేషమైన స్పందన లభించింది. ఈ పాట చిత్రీకరణతోనే షూటింగును ఈ రోజు మొదలుపెట్టాం. హీరో, హీరోయిన్ తో పాటు పలువురు డాన్సర్స్, జూనియర్ ఆర్టిస్టులు ఈ పాటలో పాల్గొంటున్నారు’ అని అన్నారు.


హీరో నట్టి క్రాంతి మాట్లాడుతూ, ”నటించడానికి మంచి అవకాశం ఉన్న పాత్రను ఇందులో పోషిస్తున్నాను. నిర్మాత గా కూడా మా అక్కయ్య కరుణ తో కలసి సినిమాలు నిర్మిస్తూనే మంచి నటుడిగా కూడా నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నాను” అని చెప్పారు.
హీరోయిన్ కృష్ణప్రియ మాట్లాడుతూ తనకిది తొలి చిత్రమని చెప్పారు.

నిర్మాతలలో ఒకరైన నట్టి కరుణ మాట్లాడుతూ, ”ఈ రోజుతో మొదలైన చిత్రీకరణ నిరవధికంగా కొనసాగుతుంది. డిసెంబర్లో సినిమాను విడుదల చేస్తామని” అన్నారు.
సంగీత దర్శకుడు ఖుద్దూస్ మాట్లాడుతూ, ”టైటిల్ పాటకు వచ్చిన స్పందన అద్భుతం. గతంలో పలు చిత్రాలు చేసిన నాకు ఈ చిత్రం సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో గీత రచయిత చంద్ర వట్టికూటి తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో అప్పాజీ, మీనా, రూపలక్ష్మి, చమ్మక్ చంద్ర, కబుర్లు నవ్యా, రమ్య తదితరులు తారాగణం.
ఈ చిత్రానికి డిఓపి: జనార్దననాయుడు, సంగీతం: ఎస్.ఏ.ఖుద్దూస్, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్: కె. వెంకటరమణ, లైన్ ప్రొడ్యూసర్స్: ప్రేమ్ సాగర్, రమణా రెడ్డి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వాల్మీకి శ్రీనివాస్, నిర్మాణ సారధ్యం: నట్టి లక్ష్మి, సమర్పణ: శ్రీధర్ పొత్తూరి, నిర్మాతలు: అనురాగ్ కంచర్ల, నట్టి కరుణ,
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నట్టికుమార్.