‘ది వారియర్’లో ‘విజిల్ మహాలక్ష్మి’గా కృతి శెట్టి…

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఊర మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ది వారియర్’. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. రామ్ 19వ చిత్రమిది. ఇందులో రామ్ సరసన కృతీ శెట్టి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

‘ది వారియర్’లో క‌ర్నూల్‌కు చెందిన ఆర్జే (రేడియో జాకీ)గా కృతీ శెట్టి సందడి చేయనున్నారు. ఆమె క్యారెక్టర్ పేరు విజిల్ మహాలక్ష్మి. క‌ర్నూల్‌లో విజిల్ మహాలక్ష్మి అంటే చాలా ఫేమస్. అమ్మాయి చేసే ప్రోగ్రామ్స్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పోలీస్‌కి, ఆర్జేకు ఎక్కడ కుదిరింది? ప్రేమలో ఎలా పడ్డారు? అనేది సినిమాలో చూడాలి. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ రిలీజైన ఆయన లుక్‌కు టెర్రిఫిక్ రెస్పాన్స్ లభించింది. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ రోజు హీరోయిన్ లుక్ విడుదల చేశారు. అందులో కూల్‌గా స్కూటర్ నడుపుతూ కృతీ శెట్టి కనిపించారు. జీన్స్, టీ – షర్ట్… మోడ్రన్‌గా ఉన్నారు.

దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ “సినిమాలో యాక్ష‌న్‌తో పాటు ప్రేమకు కూడా ఇంపార్టెన్స్ ఉంది. హీరో హీరోయిన్స్ మధ్య సీన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆర్జే విజిల్ మహాలక్ష్మిగా కృతీ శెట్టి కనిపిస్తారు. ఆమె పాత్ర ప్రేక్షకులందరూ ఇష్టపడేలా ఉంటుంది. రామ్, కృతీ శెట్టి జోడీ చూడముచ్చటగా ఉంది. రామ్ ఫ‌స్ట్ లుక్‌కు వచ్చిన స్పందన నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. పోలీసుల మధ్యలో హీరో సీరియస్ లుక్ బావుందని ప్రేక్షకులు చెప్పారు. హీరోయిన్ లుక్, రోల్ కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.

నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ… “చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. హీరో హీరోయిన్ మధ్య లవ్ సీన్స్… విల‌న్స్‌తో యాక్షన్ సీన్స్ ఎక్ట్స్రాడిన‌రీగా వస్తున్నాయి. మా హీరో రామ్ అద్భుతంగా చేస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇస్తున్నారు” అని చెప్పారు.

తెలుగు, తమిళ భాషల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళ: డి.వై. సత్యనారాయణ, యాక్షన్: అన్బు-అరివు, ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా – లింగుస్వామి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్, స‌మ‌ర్ప‌ణ: ప‌వ‌న్ కుమార్‌, నిర్మాత‌: శ్రీ‌నివాసా చిట్టూరి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శ‌క‌త్వం: ఎన్‌. లింగుస్వామి.