దర్శకుడు సుకుమార్‌కు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎంపీ

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌కు మాజీ ఎంపీ హర్షకుమార్ ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన సొంతూరు దగ్గరలో ఉన్న రాజోలులో 40 లక్షల రూపాయలతో ఆక్సిజన్ ఉత్పాదన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తన తండ్రి బండ్రెడ్డి తిరుపతి నాయుడు జ్ఞాపకార్థం సుకుమార్ ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన డైరెక్టర్ సుకుమార్‌ను మాజీ ఎంపీ హర్షకుమార్ అభినందించారు. బుధవారం సాయంత్రం సుకుమార్‌కు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా సుకుమార్‌కు థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియో కూడా విడుదల చేశారు.

‘‘సుకుమార్ గారికి కృతజ్ఞతలు. రాజోలు ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్న. ఈ కరోనా కష్టకాలంలో ఆయన అందించిన సాయం మర్చిపోలేనిది. ప్రస్తుత రోజులకు ఏం అవసరమో అది ఇచ్చారు. పది రోజుల్లో ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. చాలా త్వరగా ఆయన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రభుత్వాలు కూడా చేయలేని ఎంతో కష్టమైన పనిని ఆయన చాలా ఈజీగా చేశారు. ఈ ప్రాంతంపై ఆయనకున్న ప్రేమ అలాంటిది. ఇంత గొప్ప పని చేసిన సుకుమార్ గారికి కోనసీమ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నా.’’ అని హర్షకుమార్ ఆ వీడియోలో పేర్కొన్నారు.