
దుల్కర్ సల్మాన్ హీరోగా, నహాస్ హిదాయత్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మకమైన సినిమా “ఐ యామ్ గేమ్” తిరువనంతపురంలో గ్రాండ్ పూజతో షూటింగ్ ప్రారంభమైయింది. ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మానే తన స్వంత బ్యానర్ వేఫారర్ ఫిల్మ్స్ పై నిర్మిస్తున్నారు. పూజ కార్యక్రమానికి ప్రధాన తారాగణం హాజరయ్యారు. అందులో ప్రముఖ నటులు యాంటోని వర్గీస్, తమిళ దర్శక-నటుడు మిస్కిన్ ముఖ్యంగా పాల్గొన్నారు. మిస్కిన్ ఈ చిత్రంతో మలయాళంలోకి అడుగుపెడుతున్నారు.
ఈ చిత్రానికి కథను సజీర్ బాబ, ఇస్మాయిల్ అబుబక్కర్, బిలాల్ మొయిదు అందించారు. డైలాగ్ రైటర్స్ గా ఆధర్ష్ సుకుమారన్, షహబాస్ రషీద్ పని చేస్తున్నారు. ఇది దుల్కర్ సల్మాన్కు 40వ చిత్రం కావడం విశేషం, అలాగే నహాస్ హిదాయత్ బ్లాక్బస్టర్ ‘ఆర్డిఎక్స్’ తర్వాత దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ కావడం మరో హైలెట్. యాంటోని వర్గీస్, మిస్కిన్ ఈ చిత్రంలో భాగమవుతున్నారని ప్రకటించడంతో ఇప్పటికే అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.
తిరువనంతపురంలో చిత్రీకరణ మొదటి షెడ్యూల్ కొనసాగుతోంది. ఇది దుల్కర్ ఇప్పటి వరకు చేసిన మలయాళ చిత్రాలలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోంది. ఇందులో హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి. ప్రత్యేకంగా రూపొందించిన టైటిల్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది.