సంతోష్ గారి ఆశయం నాలో స్పూర్తిని నింపింది – డైలాగ్ కింగ్ సాయికుమార్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు విసిరిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సమాజం పట్ల ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. ఎవరో చెప్పాలి.. మనం చేయాలి అనే ఆలోచన నుంచి మనమే ముందుకు కదలాలి.. మంచిని భుజానికి వేసుకోవాలనే సహృదయులందరిని ఒక్కచోట చేర్చుతుంది.
ఈ రోజు టాలీవుడ్ డైలాగ్ కింగ్ సాయికుమార్ తన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తన నివాసంలో మొక్కలు నాటి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగం పంచుకున్నారు. అనంతరం సాయికుమార్ మాట్లాడుతూ..
“అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం, స్య గ్రోధమేకం, దశ పుష్ప జాతీంı
ద్వే ద్వే తధా దాడిమ మాతులింగే పంచామ్ర వాపీ నరకం న యాతీ ıı”
ఒక రావి చెట్టు, ఒక నిమ్మ చెట్టు, ఒక మఱ్ఱి చెట్టు, రెండు దానిమ్మ చెట్లు, రెండు మాధీ ఫలపు చెట్లు, అయిదు మామిడి చెట్లు, పది పూల చెట్లు నాటినవాడు నరకానికి వెళ్ళడు అంటుంది “శ్రీ వరహా పురాణం”.. మూడు మొక్కలు నాటి నీకే కాదు మరో ముగ్గురికి ప్రాణవాయువును పుణ్యం కట్టుకో అంటుంది “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” అందుకే ప్రతీ ఒక్కరు పాపపుణ్యాలకు అతీతంగా సమాజహితం కోసం మొక్కలు నాటాలి.. జనం బాగుకోరే “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను ముందుకు తీసుకువెళ్లాలి.
ఇదే కార్యక్రమంలో.. యంగ్ హీరో ఆది, కూతురు అల్లుడు డా.జ్యోతిర్మయి-కృష్ణ ఫాల్గునా దంపతులు, సాయికుమార్ సతీమణి సురేఖ, కోడలు అరుణ, మనుమరాలు అయాన పాల్గొని మొక్కలు నాటారు.