కీలక ప్రకటన చేసిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన చేశాడు. తన తర్వాతి సినిమా ‘లూసీఫర్’ రీమేక్‌కు దర్శకుడు ఎవరో తాజాగా బయటపెట్టాడు. త‌నిఒరువ‌న్ ఫేం మోహ‌న్ రాజా డైరెక్షన్‌లో తన తర్వాతి సినిమా చేయబోతున్నట్లు చిరంజీవి వెల్లడించాడు. ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నాడని, తనతో సినిమా తీయాలని ఆయన ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడని చిరు చెప్పాడు..

chiru

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, ఎన్వీ ప్రసాద్ కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారు. చిరంజీవి 153వ సినిమాగా ఇది తెరకెక్కనుంది. వచ్చే నెలలో సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలని చూస్తున్నారు. మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ‘లూసీఫర్’ సినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను రాంచరణ్ తీసుకున్నారు.

డైరెక్టర్ మోహన్ రాజా విషయానికొస్తే.. ఆయన తమిళంలో చాలా పాపులర్ డైరెక్టర్. ఐదు తెలుగు సినిమాలను ఆయన తమిళంలోకి విజయవంతంగా రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నాడు. తమిళంలో మోహన్ రాజా తీసిన తని ఒరువన్ సినిమా తెలుగులో “ధృవ’ పేరుతో రీమేక్ అయి విజయం సాధించింది. ప్రముఖ ఎడిటర్ మోహన్ కుమారుడే మోహన్ రాజా. చిరంజీవి హీరోగా వచ్చిన హిట్లర్ సినిమాకు మోహన్ రాజా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. చిరంజీవి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అతడు.. ఇప్పుడు ఏకంగా చిరంజీవితో సినిమా చేయడం గొప్ప విషయం అని చెప్పవచ్చు.