సీనియర్ అండ్ సిన్సియర్ డైరెక్టర్ దివంగత పి.సి.రెడ్డి గారికి తెలుగు చిత్ర పరిశ్రమ ఘన నివాళి

సీనియర్ దర్శకులు పందిళ్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి (పి.సి.రెడ్డి) (88) ఈనెల 3వ తేదీ మూసిన కళ్ళు మూసినట్లుగా నిద్రలోనే పైలోకాలకు వెళ్ళిపోయారు. ఆయన మరణవార్త తెలుగు సినీ పరిశ్రమను శోక సంద్రంలో ముంచి వేసింది. ఆయనకు నివాళులు అర్పించడానికి చిత్రపరిశ్రమ తరుపున తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాలులో ఏర్పాటు చేసిన సంతాప సభకు పరిశ్రమ లోని నిర్మాతలు, అన్ని క్రాఫ్ట్ ల వారు వచ్చి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ప్రసంగిస్తూ పి.సి.రెడ్డి గారు దాదాపు 80 సినిమాలకు దర్శకత్వం వహించారని , అందులో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఎన్నో ఉన్నాయని, 1972 వ సంవత్సరంలో ఒకే సంవత్సరం బడి పంతులు, మానవుడు దానవుడు, ఇల్లు ఇల్లాలు లాంటి మూడు విభిన్న కథా చిత్రాలను నిర్మించి మూడు చిత్రాలు రజతోత్సవ చిత్రాలుగా ఘన విజయం సాధించాయని ఆ రికార్డ్ ను ఏ దర్శకుడు బ్రేక్ చేయలేడని ఆయన గొప్పతనాన్ని గుర్తు కొనియాడారు. ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించే ఆయన లేని లోటు తీరనిదని, ముత్యాల సుబ్బయ్య, బి. గోపాల్ లాంటి ఎంతో మంది గొప్ప దర్శకులు పి.సి.రెడ్డి గారి శిష్యరికం నుంచి వచ్చిన వారేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ ప్రముఖులలో పరుచూరి గోపాలకృష్ణ, పోకూరి బాబురావు, పి. యన్. రామచంద్ర రావు, కాశీ విశ్వనాథ్, ప్రసన్న కుమార్, మోహన్ గౌడ్, రామసత్యనారాయణ, లక్ష్మణరేఖ గోపాలకృష్ణ, వింజమూరి మధు, రావిపల్లి రాంబాబు, వి.రాంబాబు, తోటకృష్ణ ఇంకా ఎందరో ఉన్నారు…