‘భీష్మ’ తొలి గీతం విడుదల

నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’.

ఈ చిత్రంలోని తొలి గీతం ఈరోజు అధికారికంగా సామాజిక మాధ్యమం అయిన ‘యు ట్యూబ్’ ద్వారా విడుదల అయింది. గీత రచయిత శ్రీమణి సాహిత్యానికి, సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ స్వరాలూ సమకూర్చగా, గాయకుడు అనురాగ్ కులకర్ణి గాత్రంలో ప్రాణం పోసుకుందీ పాట.’సింగిల్స్ యాంధమ్’ పేరుతో విడుదలయిన ఈ గీతానికి సంగీత ప్రియులనుంచి, అభిమానులనుంచి విశేష స్పందన లభించింది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన వీడియో దృశ్యాలు వాటిలోని..నితిన్ ‘నా లవ్ కూడా విజయ్ మాల్యా లాంటిదిరా…కన్పిస్తుంటుంది కానీ క్యాచ్ చెయ్యలేం’ అంటూ చెప్పే సంభాషణలు, వీటికి ప్రేక్షకాభిమానులనుంచే కాక, సామాజిక మాధ్యమాలలో సైతం విశేషమైన ప్రాచుర్యం లభించింది. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ చిత్రం, వచ్చే ఏడాది ఫిబ్రవరి లో విడుదల కానుంది

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ …ఈ చిత్రం లోని తొలిగీతం ఈరోజు విడుదల అయింది. ‘సింగిల్స్ యాంధమ్’ పేరుతో విడుదల అయిన ఈ గీతానికి ప్రేక్షకాభిమానులనుంచి అద్భుతమైన స్పందన లభించింది. నితిన్,రష్మిక జంట చూడ ముచ్చటగా ఉందన్న ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇప్పటికే విడుదల అయిన చిత్రం లోని వీడియో దృశ్యాలు విపరీతంగా వైరల్ అయ్యాయి. అలాగే భీష్మ ప్రచార చిత్రాలకు కూడా ప్రేక్షకాభిమానులనుంచి విశేషమైన స్పందన లభించింది అన్నారు. ‘భీష్మ’ చిత్ర కధ,కధనాలు,సన్నివేశాలు,సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. వినోద ప్రధానంగా సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.

నితిన్,రష్మిక మండన,నరేష్,సంపత్,రఘుబాబు,బ్రహ్మాజీ,నర్రా శ్రీనివాస్,వెన్నెల కిషోర్,అనంత నాగ్,శుభలేఖ సుధాకర్,జస్సెన్ గుప్త, సత్యన్, మైమ్ గోపి, సత్య, కల్యాణి నటరాజన్,రాజశ్రీ నాయర్,ప్రవీణ తదితరులు నటిస్తున్నారు.