బాలయ్య నటించిన ఆ ఎవర్‌ గ్రీన్ సినిమాకు 20 ఏళ్లు

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ తెరకెక్కించిన నరసింహనాయుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా ఇది నిలిచి భారీ కలెక్షన్లు సంపాదించింది. అప్పట్లో ఈ సినిమాతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను బాలయ్య అందుకున్నాడు. బాలయ్య సినిమా కెరీర్‌లోనే మరిచిపోలేని సినిమాల్లో ఒకటిగా నిలిచిన నరసింహనాయుడు విడుదలై నేటికి సరిగ్గా 20 ఏళ్లు అవుతోంది.

NARASHIMANAIDU COMPLETED 20 YEARS

2001లో జనవరి 11న ఈ సినిమా విడుదలై అప్పట్లో బాక్సాఫీస్ రికార్డులను బద్ధలు కొట్టింది. తెలుగులో రూ. 21.81 కోట్ల షేర్ సాధించిన తొలి చిత్రంగా రికార్డులను సృష్టించిన నరసింహనాయుడు.. మొత్తంగా రూ. 30 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగులో తొలిసారిగా 105 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇందులో బాలయ్య సరసన సిమ్రాన్, ప్రీతి జింగానియా ఆషా సైనీ హీరోయిన్లుగా నటించారు.

బాలయ్య యాక్షన్, యాక్టింగ్‌, డైలాగ్‌లతో పాటు మణిశర్మ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. పరుచూరి బ్రదర్స్ రాసిన మాటలు బాగా పేలాయి. బాలయ్య ట్రైన్‌లో నుంచి దిగే సీన్‌తో పాటు కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా అంటూ బాలయ్య చెప్పే డైలాగులను ఇప్పటికీ ఎవరూ మరచిపోలేరు.