39 ఏళ్ల తరువాత విడుదలవుతున్న అక్కినేని చిత్రం ‘ ప్రతిబింబాలు’!!

గతంలో వియ్యాల వారి కయ్యాలు, కోడల్లొస్తున్నారు జాగ్రత్త, కోరుకున్న మొగుడు, వినాయక విజయం వంటి చిత్రాలను నిర్మించిన విష్ణు ప్రియా కంబైన్స్ అధినేత జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి నిర్మించిన “ప్రతిబింబాలు” చిత్రం 39 ఏళ్ల అనంతరం ఇప్పుడు విడుదలకు సన్నద్ధమవుతోంది. 1982 సెప్టెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, తులసి హీరో హీరోయిన్లుగా ప్రతిబింబాలు చిత్రాన్ని ప్రారంభించారు. ఊహించని పరిణామలు, అనుకోని సంఘటనల కారణంగా చిత్ర నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. అయినప్పటికీ మొక్కావోని ఆత్మ విశ్వాసంతో, సినిమా పట్ల ఉన్న మమకారం, అభిరుచితో ఎప్పటికైనా ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్న సత్ సంకల్పంతో నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి ఎదురుచూస్తూ వచ్చారు. ఆ నిరీక్షణ 39 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఫలించబోతోంది.
ఈ చిత్రం కొంత భాగాన్ని అలనాటి ప్రముఖ దర్శకుడు కె.ఎస్. ప్రకాష్ రావు, ఇంకొంత భాగాన్ని మరో ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.

ఈ చిత్రం గురించి నిర్మాత రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ, “ఆనాడు మేము కొత్తదనంగా ఫీలయి ఈ చిత్ర కధాంశాన్ని ఎన్నుకొన్నామో, ఈనాటికీ అటువంటి కథతో ఒక్క సినిమా కూడా రాలేదు. మా సినిమా చూసి ప్రతి ఒక్కరు ఫ్రెష్ నెస్ ఫీలవుతారు. యంగ్ లుక్ లో నాగేశ్వరరావు గారి నటన ప్రతి ఒక్కరిని అలరిస్తుంది . ఆయనతో జయసుధ పోటీపడి నటించారు. అక్కినేని అభిమానులనే కాకుండా ప్రతిఒక్కరిననీ ఈ చిత్రం అలరిస్తుంది. అప్పటి ప్రముఖ నటీ నటులు ఇందులో నటించారు. మేలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం” అని తెలిపారు.
ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వర రావు, జయసుధ, తులసి, గుమ్మడి, కాంతారావు, సుత్తివేలు, రామనుజచారి, సాక్షిరంగారావు, అశోక్ కుమార్, అన్నపూర్ణ, పుష్పలత, జయమాలిని, అనురాధ తదితరులు తారాగణం.


ఈ చిత్రానికి కథ: జె.ఆర్.కె.మూర్తి, స్క్రీన్ ప్లే, మాటలు: ఆత్రేయ, పాటలు: వేటూరి, సంగీతం: చక్రవర్తి, కెమెరా: సెల్వరాజ్, హరనాధ్, ఎడిటింగ్: వీరప్ప వి.ఎస్. నిర్మాత: జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి, దర్శకత్వం: కె. ఎస్. ప్రకాష్ రావు, సింగీతం శ్రీనివాసరావు.