‘ఆదిపురుష్’ విడుదలకు ముహూర్తం ఖరారు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నాడు. పౌరాణిక కథల ఆధారంగా తీస్తున్న ఈ సినిమాలో ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ వర్క్ చేయనున్నారు. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్‌లో ప్రభాస్ ఉండగా.. ఇది పూర్తైన తర్వాత ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ ఖారారు అయింది. 2022 ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్లు ప్రభాస్ చెప్పాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది.

దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘ఆదిపురుష్’ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఇందులో సీత పాత్రలో ఎవరు నటిస్తారనే ఇంకా కన్ఫార్మ్ కాలేదు. కృతిసనన్ పేరు ప్రముఖంగా సీత పాత్ర రేసులో వినిపిస్తోంది. త్వరలోనే సినిమా యూనిట్ నుంచి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.