అక్టోబర్ 2న అయోధ్యలో “ఆదిపురుష్” టీజర్ విడుదల వేడుక

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “ఆదిపురుష్”. రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓంరావత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కృతి సనన్ నాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆదిపురుష్ అప్ డేట్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ ఆదిపురుష్ టీజర్ పోస్టర్ రిలీజ్ డేట్ ను చిత్ర బృందం అనౌన్స్ చేశారు.

అక్టోబర్ 2న శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ విడుదల వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభాస్, కృతి సనన్, దర్శకుడు ఓంరావత్ తో పాటు ఇతర చిత్రబృందం పాల్గొననున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 12న ఆదిపురుష్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఐమాక్స్ ఫార్మేట్ తో పాటు త్రీడీలో ఈ సినిమా తెరపైకి రానుంది.