

భారతదేశం గర్వించదగ్గ ప్రముఖ నటుల్లో డాక్టర్ మంచు మోహన్ బాబు గారు ప్రథమ వరుసలో ఉంటారు. సినిమా రంగంలో, విద్యారంగంలో ఆయన చెరగని ముద్ర వేశారు. మోహన్ బాబు గారు మార్చ్ 19, 1952లో జన్మించారు. ప్రస్తుతం ఆయన 73వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం మంచు వారి డ్రీమ్ ప్రాజెక్టు అయిన కన్నప్ప ప్రమోషన్స్ లో మోహన్ బాబు గారు బిజీగా ఉన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప నుంచి అప్డేట్ రాబోతోంది. కన్నప్ప చిత్రంలో మోహన్ బాబు గారు మహాదేవశాస్త్రి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు గారి బర్త్డే సందర్భంగా మహ దేవ శాస్త్రి పరిచయ గీతాన్ని విడుదల చేయనున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొన్ని విశేషాలు చూద్దాం..
విలన్గా రాణించిన రోజులు :
1975 నుంచి 1990 వరకు, మోహన్ బాబు గారు భారతీయ సినిమాల్లో విలన్ పాత్రకు కొత్త నిర్వచనాన్ని తీసుకువచ్చారు. దేశంలో అత్యధికంగా డిమాండ్ ఉన్న ప్రతినాయకులలో ఒకరిగా నిలిచిన ఆయన నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. స్వర్గం నరకం చిత్రంతో పరిశ్రమకు హీరోగా పరిచయం అయినా.. విలన్ పాత్రలతో టాప్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
హీరోగా విజయ శిఖరాలు :
1990వ దశాబ్దంలో, మోహన్ బాబు గారు హీరోగా మారి ప్రేక్షకులను తనదైన శైలితో అలరించారు. అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు వంటి బ్లాక్బస్టర్ చిత్రాలు ఆయన స్థాయిని పెంచాయి. తెలుగు చిత్రాల్లో ఆయన నటించిన అనేక చిత్రాలు తరువాత హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేయబడి అక్కడ కూడా భారీ విజయాలు సాధించాయి. తద్వారా ఆయన పేరు జాతీయ స్థాయిలో వినిపించింది.
పెదరాయుడు విజయోత్సవాల్లో 200 రోజుల వేడుక తిరుపతిలో ఘనంగా నిర్వహించబడింది. ఈ చారిత్రక వేడుకకు మొత్తం రాష్ట్ర రాజకీయ కేబినెట్, ముఖ్యమంత్రి హాజరయ్యారు, ఇది భారతీయ సినిమా చరిత్రలో అత్యంత అరుదైన ఘట్టంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. ఇది మోహన్ బాబు గారి క్రేజ్కు నిదర్శనం.
మోహన్ బాబు గారి ప్రభావం సినిమాలపై మాత్రమే కాకుండా రాజకీయ రంగానికీ విస్తరించింది. 1993లో ఆయన నిర్మించిన మేజర్ చంద్రకాంత్ చిత్రం.. ఎన్.టి.రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఈ చిత్ర 100 రోజుల వేడుక తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సభ సినిమా, రాజకీయ చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా నిలిచింది.
విద్యా రంగంలో విప్లవం :
సినిమా రంగంలో విశేష విజయాలను సాధించిన మోహన్ బాబు గారు, విద్యా రంగంలోనూ విశేషమైన సేవలను అందించారు. 1992లో స్థాపించిన శ్రీ విద్యానికేతన్ విద్యా ట్రస్ట్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా 25% ఉచిత విద్య అందిస్తూ అనేక పేద విద్యార్థులకు అభివృద్ధి అవకాశాలను సృష్టించారు. 2022లో ప్రారంభమైన మోహన్ బాబు విశ్వవిద్యాలయం విద్య పట్ల వారి అంకితభావానికి నిలువుటద్దంగా నిలిచింది.
పురస్కారాలు, గౌరవాలు :
మోహన్ బాబు గారు తన సుధీర్ఘమైన కెరీర్లో ఎన్నో గౌరవపురస్కారాలను అందుకున్నారు. 2007లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రదానం చేయగా, 2016 ఫిల్మ్ఫేర్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఆయన్ను వరించింది.

డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప :
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో మోహన్ బాబు గారు మహాదేవ శాస్త్రిగా కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆయన కెరీర్లో మరొక మైలురాయిగా నిలుస్తుంది.
సినిమా చరిత్రలో ఒక స్వర్ణ యుగం :
సామాన్య వ్యక్తిగా మొదలై.. అసామాన్య వ్యక్తిగా మోహన్ బాబు ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం. సినిమా రంగంలో ఇన్నేళ్ల పాటు సేవలు అందిస్తూ వస్తున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ 75 చిత్రాలను నిర్మించారు. ఓ నటుడు ఇలా నిర్మాతగా మారి 75 చిత్రాలు నిర్మించడం అనేది ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో రికార్డ్. ఎక్కువ చిత్రాలు నిర్మించిన ఏకైక నటుడిగా ఆయన రికార్డులు నెలకొల్పారు. ఆయన సాధించిన విజయాలను తలచుకుంటూ ఈ సువర్ణ ఘట్టాన్ని ఘనంగా జరుపుకుందాం.