
మాస్ కా దాస్, టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్లో ఉన్న నివాసంలోకి ఆదివారం (మార్చి 16) తెల్లవారు ఓ దుండగుడు చొరబడ్డాడు. చేతికందిన సొత్తు దోచుకుని పరారయ్యాడు. దీంతో విశ్వక్ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో ఆదివారం తెల్లవారు జామున భారీ దొంగతనం జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్డు నెంబర్- 8లోని ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు చేతికందిన సొత్తను తీసుకుని పరారయ్యాడు. తమ ఇంట్లో చోరీ జరిగినట్టు విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దుండగుడి కోసం గాలింపు మొదలు పెట్టారు. కాగా విశ్వక్ సేన్ కుటుంబమంతా ఒకే ఇంట్లో ఉంటోంది. విశ్వక్ సేన్ సోదరి వన్మయి బెడ్ రూమ్ మూడో అంతస్తులో ఉంటుంది. అయితే ఆదివారం తెల్లవారుజామున వన్మయి గదిలో వస్తువులన్ని చిందరవందరగా పడి ఉన్నాయి. అనుమానం వచ్చిన ఆమె రూమ్ లోని ఆల్మారాలను పరిశీలించింది. అక్కడ ఉండాల్సిన బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. దీంతో దొంగతనం జరిగినట్లు గుర్తించిన వన్మయి ఈ విషయాన్ని తండ్రి దృష్టికి తీసుకెళ్లింది. ఆయన వెంటనే ఫిలింనగర్ పోలీసులకు సమాచారం అందించారు.
కరాటే రాజు ఫిర్యాదుతో పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో ప్రాథమిక ఆధారాలు, వేలిముద్రలు సేకరించారు. అనంతరం ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. తెల్లవారుజామున 5. 50 నిమిషాల ప్రాంతంలో.. ఒక గుర్తుతెలియని వ్యక్తి బైక్ మీద వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి ఇంటి గేటు తీసుకుని డైరెక్టుగా మూడో అంతస్తుకు వెళ్లాడని, వెనుక డోర్ నుంచి విశ్వక్ సేన్ సోదరి వన్మయి బెడ్రూంలోకి వెళ్లి.. అల్మరాలో నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇదంతా కేవలం 20 నిమిషాల్లోనే జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.