
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి హీరోగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీని జీ5, జీ తెలుగు రెండింట్లోనూ ఏకకాలంలో ప్రీమియర్గా ప్రదర్శించబోతూన్నారు. థియేటర్లలో భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఈ మూవీని ZEE తెలుగులో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. టీవీ ప్రీమియర్తో పాటుగా ZEE5 ఓటీటీలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో డబ్బింగ్ వెర్షన్లను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు.
ఈ క్రమంలో ZEE5 ప్రతినిధి మాట్లాడుతూ ..‘ZEE5, ZEE తెలుగు రెండింటిలోనూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను మా ప్రేక్షకులకు అందించడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న రకాల కంటెంట్ను అందించడం పట్ల మేము గర్విస్తున్నాం. మా ప్రేక్షకులు ఎల్లప్పుడూ కొత్త కంటెంట్ను ఆదరిస్తుంటారు. ఈ చిత్రం ఇప్పటికే థియేటర్లలో బ్లాక్బస్టర్గా నిలిచింది.అలాంటి సినిమాను మా ఆడియెన్స్కు అందిస్తుండటం ఆనందంగా ఉంది. ప్రతిభావంతులైన దర్శకులు, నటీనటుల బృందంతో కలిసి పనిచేయడం మాకు ఓ అద్భుతమైన అనుభవం. ప్రస్తుతం ప్రేక్షకులు టీవీ, ఓటీటీ రెండింటిలోనూ ఏకకాలంలో ఈ చిత్రాన్ని చూడొచ్చు. ప్రతీ ఒక్కరినీ అలరించేలా ఈ చిత్రం ఉంటుందని ఆశిస్తున్నామ’ని అన్నారు
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ..‘సంక్రాంతికి వస్తున్నాం సినిమా ZEE5, ZEE తెలుగులో వస్తుండటం ఆనందంగా ఉంది. ఈ చిత్రం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతోంది. నా జీవితంలో ఈ చిత్రం ఓ మరుపురాని అద్భుతం. వెంకటేష్ దగ్గుబాటి, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, ఉపేంద్ర లిమాయేల అద్భుతమైన ప్రదర్శనలు కథను మరింత ఎలివేట్ చేశాయి. ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తుంది. ఇక ఈ డ్యూయల్ రిలీజ్ ప్రతి ఒక్కరూ ఆనందించేలా ఉంటుంది’ అని అన్నారు.
వెంకటేష్ దగ్గుబాటి మాట్లాడుతూ ..‘సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో రాజు పాత్రలో నటించడం ఆనందంగా ఉంది. అతని జీవిత ప్రయాణం, సుడిగుండంలో చిక్కుకున్నట్టుగా సాగే ప్రయాణం అందరినీ నవ్విస్తుంది. అలాంటి పాత్రలో నటించడం, అందరినీ మెప్పించేలా న్యాయం చేయడం ఆనందంగా ఉంది. ఈ స్క్రిప్ట్ పూర్తిగా అందరినీ నవ్వించేలానే ఉంటుంది. థియేటర్లలో విడుదలైన తర్వాత ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉంది. ఇప్పుడు ZEE5, ZEE తెలుగులో ఈ చిత్రం రాబోతోంది. టీవీల్లో, ఓటీటీలో ఆడియెన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారో అని ఎదురు చూస్తున్నాను. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిద’ని అన్నారు.
ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ .. ‘భాగ్యలక్ష్మి పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఇలాంటి పాత్రలు పోషించడం నాకు ఇదే మొదటి సారి. అమాయకత్వం, పొసెసివ్నెస్ ఇలా రెండింటినీ చూపించే పాత్ర. ఇలాంటి పాత్రను వెంకటేష్ గారి పక్కన పోషించడం ఆనందంగా ఉంది. నటీనటుల మధ్య కెమిస్ట్రీ చాలా చక్కగా కుదిరింది. ఇది టీవీ, OTT రెండింటిలోనూ ఆడియెన్స్కి అందుబాటులోకి వచ్చింది. అందరినీ నవ్వించేలా మా చిత్రం ఉంటుంది’ అని అన్నారు.
మీనాక్షి చౌదరి మాట్లాడుతూ .. ‘మీనాక్షి అనే పాత్ర ఈ కథకు చాలా ముఖ్యమైంది. ఆమె కారెక్టర్తోనే ట్విస్టులు వస్తాయి. రాజు, భాగ్యలక్ష్మి మధ్య వచ్చే నా పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుండి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ ఇక టీవీల్లోనూ దగ్గబోతోంది. ZEE5లో ఈ చిత్రం రాబోతోన్నందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు.
కామెడీ ఎంటర్టైనర్గా నవ్వులు పంచే ఈ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ZEE తెలుగు, ZEE5లో మార్చి 1, 2025న సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్ అవుతుంది. కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేయండి.