సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘వారణాసి’ నుంచి రెండు స్పెషల్ స్టిల్స్‌ను విడుదల చేసిన టీం

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వారణాసి’ చిత్రం నుండి రెండు ప్రత్యేక స్టిల్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ స్టిల్స్‌తో రుద్ర తన నేచురల్ లుక్‌లో ప్రపంచానికి తొలిసారిగా కనిపించాడు. మొదటి స్టిల్‌లో దట్టమైన అడవి మధ్యలో ఒక వెదురు తెప్పపై విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా రుద్ర కనిపిస్తున్నాడు. ఇక ఆ స్టిల్‌ను చూస్తే పాలసంద్రంలో ఆదిశేషుపై సేదతీరే శ్రీ మహా విష్ణువులా కనిపిస్తున్నారు. ఇంకో స్టిల్‌లో కెన్యాలోని మసాయి మారా విశాలమైన మైదానాలకు చెందింది. అక్కడ రుద్ర జిరాఫీలు, వైల్డ్‌బీస్ట్‌ల మధ్య నిలబడి, వెనక్కి తిరిగి చూస్తున్నాడు.

ఈ రెండు స్టిల్స్‌ను గమనిస్తే ‘వారణాసి’ సినిమాలోని సోల్, రుద్ర పాత్ర తీరు గురించి అందరికీ అర్థమయ్యేలా ఉంది. శతాబ్దాలను దాటి ప్రపంచాన్ని చుట్టివచ్చే ఓ వ్యక్తి ప్రయాణంగా సాగే ఇతిహాసం ఇది. ఇందులో ఒక వ్యక్తి  అసాధారణ ప్రయాణం అతడిని భారతదేశంలోని పవిత్ర జలాల నుండి భూమి మారుమూల ప్రాంతాలకు తీసుకువెళుతుంది.

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ మేరకు పోస్ట్ వేస్తూ.. ‘రుద్ర తనకంటే ఎంతో గొప్పదైన, పెద్దదైన ఒక ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి జన్మించాడు. అతను కోరుకోని విధిని మోస్తున్నాడు. అతను చమత్కారి, సున్నితమైనవాడు, ఉగ్రరూపం దాల్చగలడు. మహేష్ అతనికి తీసుకువచ్చింది అదే. ఉగ్రంగా కనిపించే పాత్రను ఎవరైనా పోషించగలరు. కానీ ఒకేసారి ఉగ్రంగా, సున్నితంగా నటించగలవారు చాలా తక్కువ మంది ఉంటారు.

ఈ ఫ్రేమ్‌లు మా ఆఫ్రికా షెడ్యూల్ నుండి తీసుకోబడ్డాయి. ఏ సెట్ ఇవ్వలేని అనుభూతిని ఆ నేల మాకు ఇచ్చింది. కిలిమంజారో చుట్టూ మసాయి మారాలో షూటింగ్ చేస్తున్నప్పుడు నేను నివ్వెరపోయాను. కొన్ని ఉదయాన్నే, మా కళ్ల ముందు ఉన్నదాన్ని 1.43:1 ఐమాక్స్ ఫ్రేమ్ కూడా ఇమడ్చలేదని నాకు అనిపించింది’ అని అన్నారు.

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో, ఎం.ఎం. కీరవాణి సంగీతంతో రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ నిర్మిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్‌లో విడుదల కానుంది.

Related Articles

Latest Articles