
అస్సాంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా పరిస్థితి తీవ్రంగా మారింది. వరదల వల్ల ఇప్పటివరకు 75 మంది మృతి చెందగా, 7 జిల్లాల్లో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆహారం, తాగునీరు, మందులు వంటి కనీస అవసరాలు కూడా అందక వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులకు సహాయం అందించేందుకు నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. బాధితుల కోసం బట్టలు, దుప్పట్లు, చెప్పులు, డ్రై ఫుడ్స్, బియ్యం, తాగునీరు, సానిటరీ ప్యాక్స్ వంటి నిత్యావసర వస్తువులను అందించి తమ వంతు సహాయం చేయాలని అభిమానులు, ప్రజలకు ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది.
ఈ సహాయ కార్యక్రమంలో నందమూరి మోహన రూప, తుమ్మల ప్రసన్న కుమార్, NBK ఫ్యాన్ అనంతపురం జగన్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. అదే విధంగా బాలయ్య యువసేన అట్లూరి దీపక్, సత్తార్, చెరుకూరి రవి, మార్ని పవన్, పొట్లూరి రామకృష్ణ, పొట్లూరి రాజేష్, వినయ్ చావా, కొమ్మ విక్రం, కర్నాటి కొండల్ రావు, మదన్ మోహన్, గోపి కృష్ణ కాకర్ల, శ్రీనివాస్ కొల్లూరి, హరేంద్ర బాబు, మణిదీప్, గౌతం, సాయి తదితరులు పాల్గొని సహాయ సామగ్రి సేకరణ కార్యక్రమం చేశారు. హైదరాబాద్లోని జేఎన్టీయూ, కేపీహెచ్బీ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రారంభించారు. ప్రజలు అనూహ్యంగా స్పందించడంతో వివిధ ప్రాంతాల నుండి ఫోన్లు వస్తూ అద్భుతమైన ఈ సేవా కార్యక్రమం నడుస్తుంది. అస్సాం వరద బాధితుల కోసం ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా తమ వంతు సాయంగా నిలిచారు. ఇంత గొప్ప సేవను నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నందుకు ఆనందంగా ఉందని నందమూరి మోహన రూపా గారు తెలిపారు.


